నల్లగొండలో దారుణం: సాంబార్ గిన్నెలో పడి చిన్నారి మృతి
మధ్యాహ్నా భోజన సమయంలో క్యూ లైన్ లో నిలుచున్న ఐదేళ్ల జయవర్ధన్ అనే విద్యార్థి ప్రమాదవశాత్తు సాంబార్ గిన్నెలో పడిపోయాడు.
నల్లగొండ: జిల్లా పరిధిలోని కట్టంగూరు మండలం ఈదులూరు గ్రామంలో ఉన్న గ్రామీణ పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది. మధ్యాహ్నా భోజన సమయంలో క్యూ లైన్ లో నిలుచున్న ఐదేళ్ల జయవర్ధన్ అనే విద్యార్థి ప్రమాదవశాత్తు సాంబార్ గిన్నెలో పడిపోయాడు.
ఒళ్లంతా గాయాలు కావడంతో జయవర్దన్ ప్రాథమిక చికిత్స కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ లోని ఉస్మానియాకు తరలించగా.. చికిత్స పొందుతూ శనివారం ఉదయం జయవర్దన్ కన్నుమూశాడు. పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం వల్లే చిన్నారి జయవర్దన్ మరణించాడని పలువురు ఆరోపిస్తున్నారు.
కాగా, పాఠశాలలో ప్రత్యేకంగా వంట గది అంటూ ఏమి లేకపోవడంతో.. ఇరుకైన గదుల్లోనే మధ్యాహ్నా భోజనాన్ని వడ్డిస్తున్నారు. దీంతో క్యూ లైన్లలో నిలుచున్న విద్యార్థులు.. వెనక్కి, ముందుకి ఒకరినొకరు నెట్టేసుకున్నప్పుడు ప్రమాద ఘటనలు జరుగుతున్నాయి. చిన్నారి జయవర్దన్ మృతికి కూడా ఇదే కారణం.
మధ్యాహ్నాం భోజనం కోసం క్యూ లైన్ లో ముందు వరుసలో నిలుచున్నాడు జయవర్దన్. ఈ క్రమంలో వెనకనుంచి విద్యార్థులు నెట్టేయడంతో.. ముందున్న సాంబార్ గిన్నెలో పడిపోయాడు. సిబ్బంది నిర్లక్ష్యమో.. విద్యార్థుల క్రమశిక్షణ రాహిత్యమో గానీ మొత్తానికి ఓ నిండు ప్రాణం బలైపోయింది.
గురుకుల పాఠశాలలో 42మందికి అస్వస్థత..
కొమురం భీమ్ జిల్లా చెలిమెల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కావడంతో 42మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వీరందరిని మంచిర్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. ఇందులో ముగ్గురికి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.