పూల కుండీల దొంగ: అర్దరాత్రి కార్లో వచ్చి, మాస్క్ పెట్టుకుని మరీ వింత చోరీ
అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ, కుక్కపిల్ల కాదేదీ కవితకనర్హం అన్నాడు శ్రీశ్రీ. అలాగే దొంగతనానికి కూడా కాదేది అనర్హం అంటున్నారు కొందరు వింత దొంగలు. ఎవరైనా ఎక్కడైనా దొంగతనం చేయాలంటే డబ్బులు, నగలు, ద్విచక్ర వాహనాలు ఇలా విలువైన వస్తువులను పట్టుకుపోతారు. కానీ ఆసక్తికరమైన దొంగతనాలు ఒక్కొక్కసారి పోలీసులను షాక్ కు గురి చేస్తాయి. ఇదేం దొంగతనం రా బాబు అని ముక్కున వేలేసుకునేలా చేస్తాయి. దీని కోసమా దొంగలా ఇంత బిల్డప్ అనుకునే దాకా వెళ్ళాయి.

అర్దరాత్రి కార్లో వచ్చి, మాస్కు పెట్టుకుని మరీ చోరీ
తాజాగా నిత్యం ఇంటి గోడపై పెట్టిన పూల కుండీలు పోవడంతో, విసిగిపోయిన ఫ్యామిలీ పూల కుండీల దొంగను పట్టుకోవాలని ప్రయత్నం చేసింది. అందులో భాగంగా సీసీ కెమెరాలను అమర్చి మరీ పూల కుండీల దొంగను గుర్తించడానికి నానా తంటాలు పడింది. తీరా.. అర్ధరాత్రి సమయంలో కారులో దర్జాగా వచ్చి ముఖానికి మాస్కు కట్టుకొని ఎవరూ గుర్తు పట్టకుండా పూల కుండీని ఎత్తుకెళ్లిన దొంగను చూసి ఓర్నీ అని ముక్కున వేలేసుకుంది. అదేదో పెద్ద దొంగతనం చేయడానికి వచ్చినట్టు పెద్ద హంగామాతో వచ్చి, పూల కుండీని తీసుకెళ్లి కార్లో పెట్టుకొని ఎంచక్కా చెక్కేసాడు సదరు దొంగ.

జగిత్యాల జిల్లాలో షాకింగ్ చోరీ .. సీసీ టీవీ ఫుటేజ్ చూసిన వాళ్ళు షాక్
తెలంగాణా రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా బీట్ బజార్ లో జరిగిన ఈ పూల కుండీల దొంగతనం స్థానికంగా ఆసక్తికర చర్చకు కారణమైంది. గత రెండు మూడు రోజులుగా ప్రతిరోజు గోడ పై పెట్టిన పూలకుండీలు మాయమవుతున్నాయి. ఒకరోజు పూలకుండీలు ఎవరో ఎత్తుకు వెళ్లడంతో, మరో పూల కుండీని గోడపై పెట్టారు. అవి కూడా ఎత్తుకెళ్ళడంతో, ఇంకో పూలకుండీని గోడపై పెట్టారు. రోజూ కుండీలు మాయం కావటంతో అసహనంతో ఉన్న కుటుంబం ఇంతకీ దొంగ ఎవరో కనిపెట్టాలని భావించి సీసీటీవీలో చూడగా అర్ధరాత్రి రెండు, మూడు గంటల సమయంలో వచ్చిన ఓ వ్యక్తి పూలకుండీలు ఎత్తుకెళ్లినట్టు రికార్డ్ అవడంతో ఒక్కసారిగా సదరు కుటుంబం ఖంగు తింది.

కార్లో వచ్చి మరీ చేసిన చోరీ .. ఓర్నీ .. ఇదేం దొంగతనం అంటున్న స్థానికులు
100, 200 రూపాయలకు వచ్చే పూల కుండీలను కూడా కార్లో వచ్చి మరీ దొంగతనం చేస్తారా అని, అది కూడా ఎంచక్కా కార్లో దర్జాగా వచ్చి మరీ దొంగతనం చేస్తారా అంటూ షాక్ తినడం వారి వంతయింది. ఇక ఇటువంటి ఘటనే గతంలోనూ హైదరాబాద్ ఎస్సార్ నగర్ బల్కం పేటలో చోటు చేసుకుంది. ఓ మహిళ తెల్లవారుజామున మూడున్నర గంటల సమయంలో ఇంటి ముందున్న పూల కుండీలను దొంగిలించుకు పోయింది. పూల కుండీలు మాయం కావడంతో ఇంటి యజమానులు ఖంగుతిని దొంగను పట్టుకునే ప్రయత్నం చేశారు.
గతంలో బల్కంపేటలోనూ పూలకుండీల చోరీ.. ఫిర్యాదుతో కేసు నమోదు
సీసీ టీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తే అందులో మహిళ పూలకుండీలు ఎత్తుకు వెళుతున్న దృశ్యాలు నమోదయ్యాయి. దీంతో పోలీస్ స్టేషన్ కు వెళ్లి మరీ మా పూలకుండీలు దొంగతనం అయ్యాయి అంటూ వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పుడు పోలీసులు ఈ ఫిర్యాదుకు షాక్ఇ తిన్నారు. ఏం పూల కుండీలు పోయాయి, ఏ సమయంలో పోయాయి, ఎవరు ఎత్తుకెళ్ళారు అన్నది దర్యాప్తు చెయ్యాల్సి వచ్చింది. ఇక తాజాగా జరిగిన పూల కుండీల వింత దొంగతనం మరోమారు చర్చనీయాంశమైంది.












Click it and Unblock the Notifications