ఎమ్మెల్సీ టికెట్కు 4 కోట్లు: అధిష్టానికి నిజామాబాదు కాంగ్రెస్ అభ్యర్థి లేఖ
హైదరాబాద్: ఇటీవల ముగిసిన స్థానిక సంస్ధల కోటాలో ఎన్నికలకు సంబంధించి నిజామాబాద్ స్థానం నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్ధి వెంకటరమణారెడ్డి శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల బరి నుంచి తాను తప్పుకోవడానికి గల కారణాలను సవివరంగా తెలియచేస్తూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలకు ఓ లేఖ రాశారు.
ఈ లేఖ తెలంగాణలో కాంగ్రెస్ సీనియర్ నేతల్లో వణుకు పుట్టిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిల్చోవాలంటే రూ. 4 కోట్ల మేరకు డిపాజిట్ చేయాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు షబ్బీర్ అలీ, మధు యాష్కీగౌడ్, మహేశ్ గౌడ్ తదితరులు డిమాండ్ చేశారని ఆయన అందులో పేర్కొన్నారు.

దీంతో రూ. 2 కోట్లను కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత షబ్బీర్ అలీ సమక్షంలోనే నేతల వద్ద డిపాజిట్ చేశానని ఆయన తెలిపారు. అయితే మిగిలిన రూ.2 కోట్లు కూడా డిపాజిట్ చేయాలని చెప్పడంతో విధిలేని పరిస్థితుల్లోనే రాజీనామా చేశానని ఆయన తెలిపారు.
అంతేకాదు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను టీఆర్ఎస్ నేతలకు అమ్ముడు పోలేదని చెప్పారు. టీఆర్ఎస్ నేతల నుంచి తాను సింగిల్ పైసా కూడా తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. అసలు టీఆర్ఎస్ నేతలెవరితోనూ తాను మాట్లాడలేదని కూడా ఆయన తేల్చి చెప్పారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బుల కోసం తనను వేధించి, బరి నుంచి తప్పుకునేలా చేసిన నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని లేఖలో ఆయన పార్టీ హైకమాండ్ను కోరారు.












Click it and Unblock the Notifications