Telangana Assembly Elections 2023: ఆ ఏడు స్థానాల్లో అదనపు బ్యాలెట్ యూనిట్లు.. ఎందుకంటే..!
ఈసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక(Telangana Assembly Elections 2023)ల్లో ఏడు నియోజకవర్గాల్లో అదనపు బ్యాలెట్ యూనిట్లు వాడనున్నారు. అదీ సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న రెండు నియోజకవర్గాలతో మరో 5 చోట్లు అదనపు బ్యాలెట్ యూనిట్లు వినియోగించనున్నారు. ఆయా నియోజకవర్గాల్లో ఎక్కువ మంది నామినేషన్ వేయడంతో అదనపు బ్యాలెట్లు వాడాల్సి వస్తోంది. సీఎం కేసీఆర్ తన సిట్టింగ్ స్థానం గజ్వేల్ నుంచే కాకుండా కామారెడ్డి నుంచి కూడా పోటీ చేస్తున్నారు. అయితే ఈ రెండు చోట్లు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి.
నవంబర్ 15తో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తి కావడంతో ఎంత మంది బరిలో ఉంటారనేది స్పష్టత వచ్చింది. గజ్వేల్ నుంచి 44 మంది పోటీలో ఉండగా.. కామారెడ్డి నుంచి 39 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. గజ్వేల్ లో కేసీఆర్ పై ఈటల రాజేందర్ పోటీ చేస్తుండగా.. కామారెడ్డి నుంచి కేసీఆర్ పై రేవంత్ రెడ్డి బరిలో నిలిచారు. ఈ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎక్కువగా ఉండడంతో అదనపు బ్యాలెట్ యూనిట్లు వాడాల్సి ఉంది. పోలింగ్ రోజు రోజు ఈ రెండు చోట్లు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం)కు మూడు చొప్పున బ్యాలెట్ యూనిట్లను అమర్చి పోలింగ్ చేపడతారు.

ఒక ఈవీఎంలో కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వీవీ ప్యాట్ అనే మూడు ప్రధాన విభాగాలుంటాయన్న విషయం తెలిసిందే. ఒక బ్యాలెట్ యూనిట్పై నోటాతో సహా 16 మంది అభ్యర్థుల పేర్లు, ఎన్నికల గుర్తు, ఫోటో ఉంటాయి. నియోజకవర్గంలో 16 మందికి మించి అభ్యర్థులు పోటీ చేస్తే ఒకటికి మించి బ్యాలెట్ యూనిట్లను వాడాలి. నోటాతో కలిపి అభ్యర్థుల సంఖ్య 17 నుంచి 32లోపు ఉంటే రెండు బ్యాలెట్ యూనిట్లు, 33 నుంచి 48లోపు ఉంటే మూడు బ్యాలెట్ యూనిట్లను వాడాల్సిందే.
గజ్వేల్, కామారెడ్డిలో 32కు మించి అభ్యర్థులు ఉండడంతో అక్కడ మూడేసి బ్యాలెట్ యూనిట్లను అమర్చనున్నారు. 2013 నుంచి అందుబాటులోకి వచ్చిన 'ఎం3'రకం ఈవీఎంలను ఈ ఎన్నికల్లో వాడనున్నారు. ఒక కంట్రోల్ యూనిట్కు వీవీ ప్యాట్తో పాటు గరిష్టంగా 24 బ్యాలెట్ యూనిట్లను అనుసంధానం చేసి ఒక ఈవీఎంను వాడొచ్చు. ఒక్క ఈవీఎంతో గరిష్టంగా 384 అభ్యర్థులకు వినియోగించవచ్చు. గజ్వేల్, కామారెడ్డితో పాటు ఎల్బీనగర్, శేరిలింగంపల్లి మూడేసి, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, రాజేంద్రనగర్ లో రెండేసి బ్యాలెట్ యూనిట్లు వినియోగించనున్నారు. ఎల్బీనగర్ లో 38 మంది, శేరిలంగంపల్లి 33 మంది, ఇబ్రహీంపట్నం 28 మంది, మహేశ్వరం 27, రాజేంద్రనగర్ లో 25 మంది పోటీ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications