సీఎం కేసీఆర్కు పాము కాటు తప్పదు -నల్లమలలో గిరిజనులపై అంత క్రూరత్వమా?: విజయశాంతి ఫైర్
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలో గిరిజనులపై ఫారెస్టు సిబ్బంది దాష్టీకం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నల్లమలలో ఇప్పపూల సేకరణ కోసం వెళ్లిన గిరిజనులపై శుక్రవారం అర్ధరాత్రి అటవీ అధికారులు, సిబ్బంది పాశవికంగా దాడి చేశారు. మహిళలు, వృద్ధులను బూటుకాళ్లతో మర్మాంగాలపైనా తన్ని తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటనలో సర్కారు సిబ్బంది తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్, కమ్యూనిస్ట్ నేతలు స్పందించగా, ఇప్పుడు బీజేపీ ఫైర్ బ్రాండ్ విజయశాంతి సదరు ఘటనను ఖండిస్తూ, సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు.
దుబ్బాక ఓటమి గుణపాఠం -సాగర్ ప్రచారానికి సీఎం కేసీఆర్ -కారుకు పోటీ లేదన్న నోముల భగత్
అసలేం జరిగిందంటే..
నాగర్కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం చెంచుపలుగు తాండా, గుంపన్పల్లి గ్రామాలకు చెందిన 23 మంది గిరిజనులు హోలీ సందర్భంగా తమ సంప్రదాయంలో భాగంగా ఇష్ట దేవతకు నైవేద్యం సమర్పించడానికి ఇప్పపూల సేకరణ నిమిత్తం శుక్రవారం బల్మూరు మండలం బాణాల సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లారు. చీకటి పడడంతో బండలచెలిమి ప్రాంతంలో వారంతా నిద్రించారు. అర్ధరాత్రి ఈ ప్రాంతంపై అటవీ సిబ్బంది మెరుపుదాడి నిర్వహించారు. 0 ఏళ్లు పైబడిన వారిని బూటుకాళ్లతో తన్ని తీవ్రంగా గాయపరిచారు. స్త్రీలు, పురుషుల మర్మాంగాలను కూడా గాయపర్చి ఫారెస్టు సిబ్బంది తమ రాక్షసత్వాన్ని ప్రదర్శించారు. గిరిజనులందరినీ మన్ననూర్ బేస్ క్యాంప్లో నిర్బంధించారు. దాడి విషయం తెలుసుకున్న గిరిజన సంఘాలు, వివిధ పార్టీల నాయకులు శనివారం నుంచి ఆందోళనలు చేస్తున్నారు. అయితే,
స్థానికేతరులపై సర్కారు నెపం..
నల్లమల అడవిలో గిరిజనులపై ఫారెస్టు సిబ్బంది పాశివిక దాడి ఘటనపై విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తుతుండటంతో సర్కారు యంత్రాంగం ఎదురుదాడికి దిగింది. గత నెలరోజులుగా అచ్చంపేట, మన్ననూర్ రేంజ్లలో 200 చోట్ల మంటలు చెలరేగాయని, విలువైన అటవీ సంపద బుగ్గిపాలైందని, ఇప్పపువ్వు, నారిగడ్డ కోసం కొందరు దుశ్చర్యలకు పాల్పడుతున్నారని, స్థానికంగా నివసించే చెంచులు, గిరిజనులకు ఫారెస్టు సిబ్బంది సహకారం ఉంటుందికానీ, స్థానికేతరులు పెద్దసంఖ్యలో అడవిలోకి చొరబడి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నందుకే కార్చిచ్చులు రాజుకుంటున్నాయని అటవీశాఖ వర్గాలు వాదిస్తున్నాయి. ఈ వివాదంలో సర్కారు తీరును తప్పుపడుతూ బీజేపీ నేత విజయశాంతి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. విజయశాంతి ఏమన్నారో ఆమె మాటల్లోనే..
జంతువుల కంటే క్రూరంగా..
''తెలంగాణలోని గిరిజనుల పట్ల అడవి జంతువుల కంటే క్రూరంగా... హీనంగా... దాడి జరిగి రెండు రోజులు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదు. నాగర్కర్నూలు జిల్లా అచ్చంపేట మండలానికి చెందిన కొందరు గిరిజనులు ఇప్పపూల కోసం అటవీ ప్రాంతంలోకి వెళ్లి రాత్రి పొద్దుపోవడంతో అక్కడే నిద్రపోవడం వారి పాలిట శాపమైంది. అదేదో మహాపాపం అన్నట్టు అటవీ శాఖ సిబ్బంది ఆ గిరిజనులపై దాడి చేసి పెద్దాచిన్నా, మహిళలు, పురుషులని చూడకుండా బూటుకాళ్లతో తన్ని జననాంగాలను గాయపరిస్తే ఉన్నతాధికారులు మాత్రం తూతూమంత్రంగా పరామర్శించి వెళ్ళిపోయారు.
టీఆర్ఎస్ సర్కారు చేతగాని తనం..
అడవి తల్లిని ఆశ్రయించుకుని బతుకుతున్న గిరిజన బిడ్డలు మీకేం అపకారం చేశారు? అగ్ని ప్రమాదాలంటూ గిరిజనులకు అటవీ ఉత్పత్తులు దక్కకుండా చేస్తే వారెలా బతకాలి? అటవీ అధికారులు, గిరిజనుల మధ్య ఎప్పటి నుంచో నలుగుతున్న ఈ సమస్యకు పరిష్కారం కోసం బాధ్యతగల పాలకులుగా మీరు చూపిన ప్రత్యామ్నాయమేంటి? అసలు అడవుల పరిరక్షణకు తెలంగాణ సర్కారు తీసుకుంటున్న చర్యలేమిటి? ఒక్కసారి ఈ లెక్కలన్నీ తీస్తే సర్కారు చేతగానితనమంతా బయటపడుతుంది. మరోవైపు..
పెంచిన పాములే కాటేస్తాయి
అడవిలో బతికే గిరిజన బిడ్డలపై దాడులు చాలవన్నట్లు, ఆదివాసీల హక్కుల కోసం పోరాడుతోన్న బీజేపీ కార్యకర్తలపై అధికార పార్టీ శ్రేణులు దాడులకు తెగబడుతున్నాయి. డిచ్పల్లి మండలం యానంపల్లి తండాలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఉన్న బీజేపీ గిరిజన మోర్చా నేతలపై టీఆరెస్ నేతలు దాడికి పాల్పడ్డారు. మొన్నటికి మొన్న గుర్రంపోడు భూముల వ్యవహారంలోనూ అధికార పార్టీది ఇదే తీరు. గిరిజనుల భూముల్ని ఆక్రమించుకోవడమే కాకుండా ప్రశ్నించినందుకు బీజేపీ నేతలపై దాడులు చేయించి, జైలుకు పంపి పైశాచికానందం పొందారు. చివరికి జర్నలిస్టులనూ మీరు వదల్లేదు. గిరిజనులపై మీరు కక్షకట్టారా? తెలంగాణలో ఎక్కడ చూసినా దాడుల విష సంస్కృతిని పెంచి పోషిస్తున్న అధికార పార్టీని వారి చర్యలే సర్పాలై కాటేయడం ఖాయం'' అని విజయశాంతి అన్నారు.
తిరుపతి పోరు: రత్నప్రభపై జనసైనికుల అసంతృప్తి నిజమే -ఉప సేనాని నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు -పవనే సీఎం