షాక్: మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి బిజెపికి రాజీనామా
హైదరాబాద్: తెలంగాణలో బిజెపిని బలోపేతం చేసేందుకు ఆ పార్టీ చేస్తున్న ప్రయత్నాలకు దెబ్బ తగిలింది. చేర్యాల మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి బిజెపికి రాజీనామా చేశారు. తన కార్యకర్తలు, అభిమానులతో త్వరలోనే సమావేశం ఏర్పాటు చేసి ఏ పార్టీలో చేరాలనే దానిపై నిర్ణయం తీసుకొంటానని ప్రతాప్ రెడ్డి చెప్పారు.
బీజేపీలో కీలకనేతగా ఉన్న జనగామ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్రెడ్డి భారతీయ జనతా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.ప్రతాప్రెడ్డి వరంగల్ జిల్లాలోని చేర్యాల నియోజకవర్గం నుంచి గతంలో గెలిచారు.
తర్వాత నియోజకవర్గాల పునవ్యవస్థీకరణలో చేర్యాలను జనగామ నియోజకవర్గంలో విలీనం చేశారు. బీజేపీ కార్యక్రమాలకు కొమ్మూరి గత కొంతకాలంగా దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రతాప్ రెడ్డి ఏ పార్టీలో చేరతారనే విషయాన్ని ఇంకా స్పష్టం చేయలేదు. అయితే పార్టీ నాయకత్వం వ్యవహరశైలితో ప్రతాప్ రెడ్డి దూరంగా ఉంటున్నారని ఆయన సన్నిహితులు అంటున్నారు.