రక్తసంబంధాన్ని వీడను, టిక్కెట్టుకోసం చేరలేదు, కానీ, ఓడిస్తామన్నారు:శిల్పా సంచలనం
భూమా నాగిరెడ్డి టిడిపిలోకి వచ్చిన తర్వాత పార్టీలో ఘర్షణ వాతావరణం నెలకొందని చెప్పారు మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు శిల్పామోహన్ రెడ్డి.
హైదరాబాద్: భూమా నాగిరెడ్డి టిడిపిలోకి వచ్చిన తర్వాత పార్టీలో ఘర్షణ వాతావరణం నెలకొందని చెప్పారు మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు శిల్పామోహన్ రెడ్డి. బుదవారం నాడు ఆయన జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. నంద్యాల టిక్కెట్టు కోసం తాను వైసీపీలో చేరలేదన్నారు.పార్టీ చీఫ్ ఈ విషయాన్ని నిర్ణయిస్తారని ఆయన చెప్పారు.
వైసీపీలో చేరిన తర్వాత పార్టీ కేంద్రకార్యాలయంలో శిల్పా మోహన్ రెడ్డి హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు. భూమా నాగిరెడ్డి టిడిపిలో చేరిన తర్వాత నువ్వా, నేనా అనే పరిస్థితి నెలకొందన్నారు. తాను ఏనాడూ కూడ ఘర్షణ వాతావరణాన్ని కోరుకోలేదన్నారు శిల్పా.
అయితే మున్సిఫల్ కార్యాలయంపై దాడి ఘటనతో భూమావర్గీయులపై కేసులు పెట్టినట్టు చెప్పారు. అయితే పార్టీలో గౌరవం లేనందునే పార్టీని వీడాల్సి వచ్చిందన్నారు. వీడియో కాన్పరెన్స్ లతో కార్యకర్తలను పార్టీ నాయకులను ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు.
తనలాంటి వాళ్ళకు సమర్థవంతుడైన నాయకుడు కావాలని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలోనే తాను వైసీపీలో చేరాలనుకొన్నప్పటికీ కొన్ని కారణాలవల్లే వైసీపీలో చేరలేకపోయినట్టు చెప్పారు. ఈనాడు వైసీపీలో చేరడంతో స్వంత ఇంటికి వచ్చినట్టు ఉందన్నారు శిల్పా మోహన్ రెడ్డి.అధికారపార్టీకి రాజీనామా చేసి ప్రతిపక్షపార్టీలో ఎందుకు చేరుతున్నామో అర్ధం చేసుకోవాలని ఆయన కోరారు.
ఓడిస్తామని ఎస్పీవై రెడ్డి బెదిరించాడు
తనకు టిక్కెట్టిస్తే ఓడిస్తామని ఎస్పీవై రెడ్డి బెదిరించారని శిల్పా మోహన్ రెడ్డి చెప్పారు. మూడేళ్ళ పాటు తనకు పార్టీలో సరైన గౌరవం దక్కలేదన్నారు. తన క్యాడర్ ను కాపాడుకొనే ఉద్దేశ్యంతోనే టిడిపిని వీడాల్సి వచ్చిందన్నారు. ఉప ఎన్నికల్లో తనకు టిక్కెట్టు ఇస్తే పార్టీలోనే ఉంటున్న నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి ఓడిస్తామని బెదిరించారని చెప్పారు. పార్టీలోనే ఉన్న నాయకులే స్వంత పార్టీ నాయకులపై ఈ రకంగా వ్యాఖ్యలు చేయడం సరైందా అని ఆయన ప్రశ్నించారు. భూమా నాగిరెడ్డి పార్టీలో చేరిన తర్వాత ఈ పరిస్థితి ఎక్కువైందన్నారు.
కుటుంబంలో గొడవలు రావు
గతంలో కూడ ఇద్దర సోదరులు వేర్వేరు పార్టీల్లో కొనసాగిన విషయాన్ని శిల్పా మోహన్ రెడ్డి గుర్తుచేశారు. మూడేళ్ళపాటు ఇద్దరం ఒకే పార్టీలో ఉన్నట్టు చెప్పారు. అయితే గత ఎన్నికల సందర్భంగా ఇద్దరం స్వల్పతేడాతో ఓటమిపాలైన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. శోభా నాగిరెడ్డి మరణం వల్ల తాను 1800 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యానని, తన సోదరుడు 3వేల ఓట్లతో ఓటమిపాలైనట్టు చెప్పారు. వేర్వేరు పార్టీల్లో ఉన్నప్పటికీ తమ రక్తసంబంధంలో తేడా ఉండదని చెప్పారు శిల్పా మోహన్ రెడ్డి.కుటుంబంలో తేడాలు రావన్నారు.గవర్నర్ కోటాలోనో, ఎమ్మెల్యే కోటాలోనో ఎమ్మెల్సీగా తమ్ముడికి పదవిని ఇవ్వాలని కోరినా, స్థానికసంస్థల ఎన్నికల ఎమ్మెల్సీ కోటా కింద పోటీచేయాల్సి వచ్చిందన్నారు.
టిక్కెట్టు కోసం రాలేదు
నంద్యాల ఉప ఎన్నికల్లో టిక్కెట్టు కోసం తాను పార్టీ మారలేదన్నారు. పార్టీ మారేందుకు నిర్ణయం తీసుకొన్న సమయంలో మంత్రులు తనకు ఫోన్ చేసి టిక్కెట్టు విషయంలో హమీ ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. వైసీపీ టిక్కెట్టు తనకు ఇస్తారనే హమీ ఇవ్వలేదన్నారు. టిక్కెట్టు కోసం తాను పార్టీ మారలేదన్నారు. పార్టీ టిక్కెట్టు ఎవరికి కేటాయించినా తాను వారి గెలుపుకోసం పనిచేస్తానని చెప్పారు. నంద్యాలలో వైసీపీ జెండాను ఎగురవేస్తానని చెప్పారు.
అంతా నావెంటే
నంద్యాల మున్సిఫల్ ఛైర్మెన్ ,, 25 కౌన్సిలర్లతో పాటు , 21 ఎంపిటిసి సభ్యులు, 16 సర్పంచ్ లు, 1 ఎంపిపి, 1 జడ్ పి టి సి సభ్యులు తనతో పాటే టిడిపికి రాజీనామా చేసి వైసీపీలో చేరారని చెప్పారు. గృహ నిర్మాణ పథకంలో 13 వేల ఇళ్ళు మంజూరు చేసినట్టు చెప్పుకొంటున్నారని, ఇప్పటికీ కేవలం 200 ధరఖాస్తులు మాత్రమే వచ్చాయన్నారు. గతంలో తాను తీసుకొచ్చిన పనులను తాము మంజూరుచేసుకొంటున్నట్టు చెప్పుకొంటున్నారని ఆయన పరోక్షంగా అఖిలప్రియపై విమర్శలు గుప్పించారు.