కేంద్ర ఎన్నికల సంఘం అనర్హత వేటుపై బలరాం నాయక్ రియాక్షన్...
మూడేళ్ల పాటు చట్టసభలకు పోటీ చేయకుండా కేంద్ర ఎన్నికల సంఘం విధించిన అనర్హత వేటుపై కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ స్పందించారు. 2019 లోక్సభ ఎన్నికల్లో తన పోటీకి సంబంధించిన వ్యయం వివరాలను మహబూబాబాద్ జిల్లా కలెక్టర్కు సమర్పించానని చెప్పారు. ఆ డాక్యుమెంట్లను ఎన్నికల కమిషన్కు కూడా పంపిస్తానని తెలిపారు. ఈ విషయంలో కాంగ్రెస్ కార్యకర్తలు,తన అభిమానులెవరూ ఆందోళన చెందవద్దని బలరాం నాయక్ విజ్ఞప్తి చేశారు.
2019 లోక్సభ ఎన్నికల్లో మహబూబాబాద్ నుంచి పోటీ చేసిన బలరాం నాయక్ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో పోటీకి సంబంధించిన వ్యయం వివరాలను నిర్ణీత గడువు లోగా ఆయన సమర్పించలేదని కేంద్ర ఎన్నికల సంఘం అంటోంది. ఈ కారణంతోనే మూడేళ్ల పాటు చట్టసభలకు పోటీ చేయకుండా ఆయనపై అనర్హత వేటు వేసింది. దీంతో వచ్చే మూడేళ్ల పాటు పార్లమెంట్ ఉభయ సభలు,అసెంబ్లీ,శాసనమండలికి పోటీ చేసే అర్హతను ఆయన కోల్పోయినట్లయింది.

బలరాం నాయక్పై వేటుకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. బలరాం నాయక్తో పాటు మహబూబాబాద్ నుంచి సీపీఐ అభ్యర్థిగా పోటీ చేసిన కల్లూరి వెంకటేశ్వరరావు, నల్గొండ నుంచి పోటీ చేసిన బహుజన్ ముక్తి పార్టీ అభ్యర్థి వెంకటేశ్, స్వతంత్ర అభ్యర్థి రొయ్యల శ్రీనివాసులు, మెదక్ నుంచి శివసేన తరఫున పోటీ చేసిన హన్మంతరెడ్డిలపై కూడా ఈసీ అనర్హత వేటు వేసింది.
2009 లోక్సభ ఎన్నికల్లో బలరాం నాయక్ మహబూబాబాద్ స్థానం నుంచి కాంగ్రెస్ తరుపున గెలిచిన సంగతి తెలిసిందే. 2012లో మన్మోహన్ సింగ్ కేబినెట్లో ఆయనకు చోటు దక్కింది. ఆ తర్వాతి ఎన్నికల్లో ఆయన ఓటమిపాలయ్యారు.












Click it and Unblock the Notifications