ఫార్ములా వన్ రేసు పేరిట భారీ కుంభకోణం: డీసీ అధినేత కూతురు అంజనీ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్: నగరంలో ఫార్ములా వన్ రేస్ పేరిట భారీ కుంభకోణం జరిగింది. ఓ వ్యాపారవేత్త నుంచి భారీగా డబ్బులు వసూలు చేసిన ఫార్ములా వన్ రేస్ నిర్వాహకురాలు అంజనీరెడ్డి పోలీసులు కేసు నమోదు చేశారు. అంజనీరెడ్డితోపాటు మరో ఇద్దర్ని అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులు.. వారిని ప్రశ్నిస్తున్నారు. మరికొదరు ప్రముఖులను కూడా విచారిస్తున్నట్లు తెలిసింది.
కోట్లు వసూలు...
మచదర్ మోటార్ కారు సంస్థ అనే సంస్థ పేరుతో అంజనీరెడ్డి మోసాలకు పాల్పడినట్లు తేల్చారు. 2011లో కార్ రేసింగ్ నిర్వహిస్తామంటూ రూ. కోట్లు వసూలు చేశారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంజనీరెడ్డి దక్కన్ క్రానికల్ ఎండీ వినాయక రవిరెడ్డి కుమార్తె.
రూ.12.5కోట్లు వసూలు
వివరాల్లోకి వెళితే.. ఫార్ములా వన్ రేస్ ఫ్రాంచైజీ ఇస్తామంటూ రఘురాంకృష్ణంరాజు అనే వ్యాపారవేత్త నుంచి రూ.12.5కోట్లు అంజనీరెడ్డి తీసుకున్నట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో చాముండేశ్వరీనాథ్ మధ్యవర్తిగా వ్యవహరించారు.
డబ్బులు రాకపోవడంతో ఫిర్యాదు..
అయితే, ఆ డబ్బులు తిరిగి ఇప్పిస్తామని చెప్పిన ఆయన... అలా చేయకపోవడంతో సదరు వ్యాపారవేత్త పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. రఘురామ కృష్ణం రాజు తరపున ఆయన ఛార్టెడ్ అకౌంటెంట్ నరసింహ భారతి సీసీఎస్ పోలీసులను ఆశ్రయించారు.
సచిన్, షారుక్, నాగ్లనూ వాడేశారు..
ఇతర రాష్ట్రాల రాజధానులలో కూడా ఫార్ములా వన్ నిర్వహిస్తున్నామని చెప్పి, చెన్నై ఫ్రాంఛైజీ కోసం సదరు వ్యాపారవేత్త నుంచి రూ.12.5కోట్లు వసూలు చేసినట్లు తెలిసింది. ఇప్పటి వరకు రూ.5కోట్లే ఆ వ్యాపారవేత్తకు అంజనీ రెడ్డి నుంచి అందగా, మిగితాది చెల్లించాల్సి ఉందని సమాచారం. అంతేగాక, అంజనీరెడ్డి తమ ఫార్ములా వన్ రేసుకు బ్రాండ్ అంబాసిడర్లుగా సచిన్ టెండూల్కర్, షారుక్ ఖాన్, నాగార్జునలను నియమిస్తున్నట్లు నమ్మించినట్లు తెలిసింది.