పక్కా ప్రణాళికతో హత్య: మురళిని చంపిన కేసులో నలుగురి అరెస్టు

పకడ్బందీ పథకం ప్రకారం ప్రతీకారంగా మురళి అనే వ్యక్తిని హత్య చేసిన కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నలుగురిని అరెస్టు చేశారు.

వరంగల్ : ప్రతీకారం తీర్చుకునే క్రమంలోనే ఇటీవల లింగాలఘనపురం మండలం నెల్లుట్ల శివారు వడ్డెర కాలనీలో పందిగోటి మురళి(35) హత్య జరిగినట్లుగా పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. మురళిని హత్య చేసిన వారిలో నలుగురు నిందితులను ఈ మేరకు పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. స్థానిక ఏసీపీ కార్యాయంలో శుక్రవారం మురళి హత్యకు పాల్పడ్డ నిందితుల అరెస్టు, కేసు పూర్వాపరాలను ఏసీపీ పద్మనాభరెడ్డి మీడియాకు వివరించారు.

ఆయన తెలిపిన వివరాల ప్రకారం... ఈ నెల 26న కాలనీలో పందిగోటి మురళి అనే స్థిరాస్తి వ్యాపారి హత్యకు గురయ్యాడు. అప్పటి నుంచి నిందితుల కోసం గాలించిన పోలీసులు ఎట్టకేలకు హత్యకు పాల్పడిన నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. హత్యకు గురైన మురళి సోదరి శాయమ్మ అలియాస్‌ శైలజను మేనబావ అయిన శివరాత్రి వెంకటస్వామికి ఇచ్చి 25 సంవత్సరాల క్రితమే వివాహం జరిపించారు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.

వెంకటస్వామి తరచూ తన భార్య శాయమ్మను వేధించడంతో ఆయన వేధింపులు భరించలేక సుమారు 20 సంవత్సరాల క్రితమే పుట్టింటికి వచ్చి ఉంటోంది. అప్పటి నుంచి మురళి కుటుంబానికి, ఆయన బావ వెంకటస్వామి కుటుంబానికి గొడవలు ప్రారంభమయ్యాయి. గతంలో వెంకటస్వామిని ప్రవర్తన మార్చుకోవాలని మృతుడు మురళి సోదరుడు పందిగోటి రాజు మందిలించాడు. దీంతో 1998లోనే వెంకటస్వామి తన తండ్రి అబ్బయ్యతో కలిసి హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న రాజును హత్య చేశాడు.

Four arrested in Murali murder case

అప్పటి నుంచి ఈ రెండు కుటుంబాల్లో మరింత అగాధం ఏర్పడి కక్షలు పెరిగాయి. తన సోదరుడు రాజు హత్యకు ప్రతీకారంగా మృతుడు మురళి తన బావ వెంకటస్వామి సోదరుడు శివరాత్రి విజయ్‌ను 2013లో తన అనుచరులతో కలిసి తుపాకితో కాల్చి చంపాడు. ఈ కేసు ప్రస్తుతం కోర్టులో నడుస్తోంది. ఈ క్రమంలో వెంకటస్వామి కూడా తన తండ్రి అబ్బయ్యతో కలిసి సోదరుడు విజయ్‌ను హత్య చేసిన మురళిపై కక్ష పెంచుకుని ఎలాగైనా చంపాలని పథకం వేశాడు.
గతంలోనే మృతుడు మురళి తన సోదరి శాయమ్మతో బావ వెంకటస్వామిపై వేధింపుల కేసు కూడా పెట్టించాడు. ఈ నేపధ్యంలో హైదరాబాద్‌లో ఉంటున్న వెంకటస్వామి కల్యాణి అనే మహిళతో సహజీవనం సాగిస్తున్నాడు. ఈమె సోదరుడు అఖిల్‌, మృతుడు పందిగోటి మురళికి సన్నిహితుడైన అశ్వరావుపల్లికి చెందిన వరికొప్పుల శేఖర్‌తో మురళిని హత్య చేయడానికి పథకం వేశాడు.

మురళిని హత్య చేయడానికి అంగీకరించిన శేఖర్‌ పథకం రచించారు. దీంతో వెంకటస్వామి తన బావమరిది అఖిల్‌తోపాటు అతని స్నేహితులైన నెక్కొండ మండలం అలంఖానిపేటకు చెందిన కొమ్ము మహేశ్‌, పర్వతగిరి మండలం చింతనెక్కొండకు చెందిన దబ్బటి యాలాద్రితో కలిసి మురళిని హత్య చేసేందుకు ప్రణాళిక రూపొందించుకున్నారు. ఈ నెల 25న శేఖర్‌, అఖిల్‌, మహేశ్‌ను వెంకటస్వామి హైదరాబాద్‌లోని తన ఇంటికి పిలిపించుకుని మురళిని చంపడానికి తాను వేసుకున్న పథకాన్ని చెప్పాడు.

చేపలు బావిలో వేసే క్రమంలో మురళిని చంపడానికి వీలుగా అఖిల్‌కు కత్తిని, శేఖర్‌కు సుత్తెను ఇచ్చాడు. మహేశ్‌, యాలాద్రికి మురళిని తాళ్లతో కట్టి మెడకు గుంజి కట్టి చంపాలని తాళ్లను అందించాడు. దీంతో ఈనెల 26న వెంకటస్వామి తన కారు(టీఎస్‌ 08ఈడి1029)లో చేపలతో సహా శేఖర్‌, అఖిల్‌, మహేశ్‌ను ఎక్కించుకుని జనగామకు వచ్చాడు. వీరిని జనగామలో దించి వెంకటస్వామి వెళ్లిపోయాడు. ద్విచక్ర వాహనంపైన మృతుడు మురళి, అతని స్నేహితుడు శేఖర్‌ వ్యవసాయ బావి వద్దకు వెళ్లారు.

అప్పటికే అక్కడ పథకం ప్రకారం అఖిల్‌, మహేశ్‌, యాలాద్రి మాటు వేసి ఉన్నారు. వ్యవసాయ బావి వద్దకు మురళి, శేఖర్‌ వెళ్లారు. చేపలను మురళి బావిలో వేస్తున్న క్రమంలో ఒక్కసారిగా అఖిల్‌ కత్తితో మురళిని వీపులో పలుమార్లు పొడిచాడు. దీంతో మురళి కొద్ది దూరం వరకు ప్రాణ రక్షణ కోసం పరుగెడుతున్న క్రమంలోనే అతన్ని వెంబడించిన మహేశ్‌, యాలాద్రి మురళిని పట్టుకోగా, శేఖర్‌ మురళి తలపై గట్టిగా పలుమార్లు మోదాడు. దీంతో కిందపడిపోయిన మురళిని తాడుతో మెడకు కట్టి చనిపోయే వరకు ముడిని బిగించడంతో మురళి మృతి చెందాడు.

మురళిని చంపిన విషయం మొబైల్‌లో వెంకటస్వామికి నిందితులు చెప్పగా, వెంకటస్వామి ఘటనా స్థలానికి వచ్చాడు. నిందితులు మురళి మృతదేహాన్ని కారు డిక్కీలో వేసుకుని వెంకటస్వామి ఇంటికి వెళ్లారు. వెంకటస్వామి మురళిని చంపిన విషయాన్ని తన తండ్రి అబ్బయ్యకు చెప్పి, మృతదేహాన్ని చూపించాడు. కొద్ది సేపటి అనంతరం వెంకటస్వామి తన ద్విచక్ర వాహనంపై బయటకు వెళ్లిపోయాడు. దీంతో హత్య చేసిన నిందితులు పలుమార్లు వెంకటస్వామికి మొబైల్ ద్వారా ఫోన్లు చేయగా ఆయన ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసి ఉంది. దీంతో ఆందోళన చెందిన నిందితులు మురళిని చంపిన ఆయుధాలు, రక్తం మరకలు ఉన్న తమ బట్టలను ఓ సంచిలో పెట్టి గ్రామ చివరలో చెట్ల పొదల్లో వేసి పరారయ్యారు.

ఎట్టకేలకు పోలీసుల గాలింపులో భాగంగా నిందితులను శుక్రవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. హత్యలో నిందితులుగా ఉన్న అఖిల్‌, శేఖర్‌, అబ్బయ్య, మహేశ్‌ను అదుపులోకి తీసుకున్నామని, శివరాత్రి వెంకటస్వామి, యాలాద్రి పరారీలో ఉన్నట్లు ఏసీపీ తెలిపారు. నిందితులను పట్టుకున్న రఘునాధపల్లి సీఐ తిరుపతి, లింగాలఘనపురం ఎస్సై వేణుగోపాల్‌ను ఏసీపీ పద్మనాభరెడ్డి అభినందించారు.

అత్యాచారం ఘటనలో ఏడేళ్ల కారాగారం

ఓ వివాహితపై అత్యాచారాయత్నానికి పాల్పడిన ఘటనలో ఏరుకొండశంకర్‌కు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ మొదటి అదనపు సహాయక సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి సీహెచ్‌వీఆర్‌ఆర్‌ వరప్రసాద్‌ శుక్రవారం తీర్పుచెప్పారు. ప్రాసిక్యూషన్‌ కథనం ప్రకారం శాయంపేట మండలం కొప్పుల గ్రామానికి చెందిన ఏరుకొండ శంకర్‌ 2013 ఏప్రిల్‌ 25న అర్ధరాత్రి ఓ వివాహిత ఇంట్లోకి చొరబడి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. ఆ మహిళ అరుపులతో పరారయ్యాడు.

ఈ ఘటనపై బాధిత మహిళ శాయంపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు శంకర్‌పై కేసు పెట్టి దర్యాప్తు అనంతరం న్యాయస్థానంలో నేరారోపణ పత్రాన్ని దాఖలు చేశారు. విచారణలో శంకర్‌పై నేరం రుజువుకావటంతో కోర్టు అతడికి ఏడేళ్ల జైలుశిక్ష తో పాటు రూ.15వేల జరిమానా విధించింది. ఈ కేసులో ప్రాసిక్యూషన్‌ తరఫున అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కె.దుర్గాజీ వాదించగా, కోర్టు కానిస్టేబుల్‌ ఎ.శేఖర్‌ సాక్షులను న్యాయస్థానంలో హాజరుపర్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+