Rains: నాలుగురోజులు వదలబొమ్మాలీ అంటున్న బంగాళాఖాతం!
రాబోయే నాలుగు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి, ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణ రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
తెలంగాణా రాష్ట్రంలో వర్షాలు
ఇక నేడు, రేపు కొన్ని ప్రాంతాలలో తేలికపాటి జల్లులు, మరికొన్ని ప్రాంతాలలో ఒక మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. కాగా నేడు రాష్ట్రంలోని అనేక జిల్లాలలో పలు ప్రాంతాలలో ఈదురు గాలులు ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఆయా జిల్లాలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.

ఆ జిల్లాలకు ఎల్లో అలెర్ట్
నేడు కామారెడ్డి ,సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, హన్మకొండ, వరంగల్, నాగర్ కర్నూల్, వనపర్తి , జోగులాంబ గద్వాల జిల్లాలలో ఈదురు గాలులు ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని పేర్కొంది. ఇప్పటికే అనేక చోట్ల నేడు వర్షాలు కురిశాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
వచ్చే నాలుగు రోజులూ వర్షాలే
ఇదిలా ఉంటే వచ్చే నాలుగు రోజులు ఉమ్మడి నిజామాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్, కరీంనగర్ జిల్లాలలో మోస్తరు వర్షాలతో పాటు, భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టు పేర్కొంది. వర్షం కురిసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, విద్యుత్ వైర్ల కింద, చెట్ల కింద ఉండరాదని, ఉరుములు మెరుపులు వస్తున్న సమయంలో ఫోన్లు మాట్లాడరాదని సూచించింది. ఇక రైతులు పంటల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది.
ఈసారి త్వరగానే కేరళ తీరాన్ని తాకనున్న రుతుపవనాలు
ఇదిలా ఉంటే ఈసారి నైరుతి రుతుపవనాలు అనుకున్న సమయం కంటే ముందుగానే కేరళ తీరాన్ని తాకే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రస్తుతం అండమాన్ నికోబార్ దీవుల్లో ఋతుపవనాలు పూర్తిగా విస్తరించి ఉన్నాయని ఈనెల 27వ తేదీన కేరళ తీరాన్ని తాకే అవకాశం అంచనా వేసినప్పటికీ, అంతకంటే ముందే ఈ నెల 24వ తేదీన కేరళలోకి ప్రవేశిస్తాయని, ఇక జూన్ మొదటి వారంలోనే తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.












Click it and Unblock the Notifications