గంటకు 220 కిలోమీటర్ల వేగంతో 4 గంటల్లో హైదరాబాద్ నుంచి విశాఖ
విశాఖపట్నం నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు సెమీ హైస్పీడ్ రైల్ కారిడార్ ను నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెలలోనే రైల్వే బోర్డుకు ప్రిలిమినరీ ఇంజనీరింగ్ ట్రాఫిక్ సర్వే నివేదిక అందనుంది. దీన్నిబట్టి ఎంత వ్యయమవుతుందనే విషయంలో స్పష్టత వస్తుంది. ఈ నివేదికకు రైల్వే బోర్డు నుంచి ఆమోదం లభించిన తర్వాత డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ రూపొందించేందుకు సర్వే నిర్వహిస్తారు. విశాఖపట్నం-విజయవాడ-శంషాబాద్, విశాఖపట్నం-విజయవాడ-కర్నూలు ప్రాజెక్టుల ప్రాథమిక అంచనా వ్యయం రూ.21 వేల కోట్ల పైచిలుకు ఉండబోతోంది.
తగ్గిన స్టేషన్ల సంఖ్య
ఈ కారిడార్ లో స్టేషన్ల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. గమ్యస్థానానికి త్వరగా చేరుకోవాలనే ఉద్దేశంతో స్టేషన్ల సంఖ్యను తగ్గించారు. ఏపీలో ఆరు స్టేషన్లు, తెలంగాణలో ఆరు స్టేషన్లు విశాఖ-శంషాబాద్ మార్గంలో వస్తాయి. సూర్యాపేట వద్ద కర్నూలు-విశాఖ సెమీ హైస్పీడ్ కారిడార్ ను కలుపుతారు. ఈ మార్గంలో మొత్తం ఎనిమిది స్టేషన్లు వస్తుండగా అందులో ఏడు స్టేషన్లు తెలంగాణ పరిధిలో ఉంటాయి. కర్నూలు ఒక్కటే ఏపీ పరిధిలో ఉంటుంది. రెండు స్టేషన్ల మధ్య ఎక్కువ దూరం తుని నుంచి రాజమండ్రి మధ్యలో 88 కిలోమీటర్లు ఉండనుంది. అతి తక్కువ దూరం సూర్యాపేట నుంచి నకిరేకల్ మధ్య 28 కిలోమీటర్లు ఉండనుంది.

గట్టుప్పల్ నుంచి చిట్యాలమీదుగా
విజయవాడ జాతీయ రహదారి ఎల్ బీ నగర్ నుంచి చౌటుప్పల్ మార్గంలో సాగుతుంది. అయితే శంషాబాద్ నుంచి సాగే సెమీ హైస్పీడ్ కారిడార్ మునుగోడు నియోజకవర్గ పరిధిలోని గట్టుప్పల్ నుంచి వెళ్లబోతోంది. చౌటుప్పల్ నుంచి గట్టుప్పల్ మధ్య 24 కిలోమీటర్ల దూరం ఉంటుంది. జాతీయ రహదారికి కొంచెం ఎక్కువ దూరంలోనే ఉంటాయి. తెలంగాణ చిన్న రాష్ట్రం కావడంతో భూసేకరణ సమస్యగా ఉంది. భూముల ధరలు జాతీయ రహదారి పక్కన ఎక్కువగా ఉండటంతో ప్రాజెక్టు అంచనా వ్యయం డబులయ్యే అవకాశం ఉంది.
అందుకే గట్టుప్పల్ మీదుగా చిట్యాల్ పశ్చిమ, నకిరేకల్, సూర్యాపేట వరకు కారిడార్ సాగుతుంది. కర్నూలు నుంచి వచ్చే కారిడార్ సూర్యాపేట వద్ద కలుస్తుంది. సర్వే కూడా పూర్తయిన తర్వాత భూసేకరణకు నోటిఫికేషన్ విడుదల చేసి పనులు ప్రారంభించబోతున్నారు. విశాఖపట్నం నుంచి శంషాబాద్ కు గంటకు 220 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తే నాలుగు నుంచి నాలుగున్నర గంటల్లో చేరుకునే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications