ఈదురుగాలులకు కూలిన రేకుల షెడ్డు: చిన్నారి సహా నలుగురి మృతి
నాగర్కర్నూల్: తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం కురిసిన ఈదురుగాలులతో కూడిన వర్షం విషాదాన్ని నింపింది. నాగర్ కర్నూల్ జిల్లా తాడూరులో ఈదురు గాలులకు నిర్మాణంలో ఉన్న రేకుల షెడ్డు కూలి పదేళ్ల చిన్నారి సహా నలుగురు మృతి చెందారు. ఈ ఘటనలో మరో నలుగురికి తీవ్ర గాయాలు కాగా, ఒకరు సురక్షితంగా బయటపడ్డారు.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు శివారులో సాయంత్రం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో వ్యవసాయ పొలంలో నిర్మాణంలో ఉన్న రేకుల షెడ్డు కిందకు అక్కడే పని చేస్తున్న తొమ్మిది మంది వెళ్లారు. గాలి బలంగా వీయడంతో షెడ్డుపై ఉన్న రేకులు ఎగిరిపోయాయి.

ఒక్కసారిగా నిర్మాణంలో ఉన్న గోడ కూలిపోవడంతో ఆ గోడ పక్కనే ఉన్న యజమాని మల్లేశ్, అతని పదేళ్ల కుమార్తె సహా అక్కడ పని చేసే మరో ఇద్దరు కూలీలు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో నలుగురికి గాయాలు కాగా, ఒకరు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇది ఇలావుండగా, మేడ్చల్ జిల్లా కీసర మండలంలో గాలి దుమారంతో కూడిన వర్షాల కారణంగా రోడ్డు పక్కన ఉన్న చెట్లు విరిగిడింది. దీంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. తిమ్మాయిపల్లి గ్రామ సమీపంలోని కీసర నుంచి షామీర్ పేట వైపు వెళ్లే రోడ్డు పక్కన ఇద్దరు బైక్పై వెళుతున్నారు. వారిపై చెట్టు పడటంతో వారిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్రగాయాలు అయ్యాయి.
వెంటనే అతడ్ని ఇసీఐఎల్లోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతులు యాదాద్రి జిల్లా బొమ్మల రామారం మండలానికి చెందిన నాగిరెడ్డి రామ్రెడ్డి, ధనుంజయగా గుర్తించారు. భారీ వర్షం, ఈదురుగాలులతో హైదరాబాద్ తోపాటు పలు ప్రాంతాల్లో పెద్ద చెట్లు విరిగి పడిపోయాయి. పలు చోట్ల హోర్డింగులు కూలాయి.












Click it and Unblock the Notifications