లక్షల విలువ చేసే సొత్తును కొల్లగొట్టారు: సెల్ ఆన్ చేసి దొరికిపోయారు
లక్షల విలువైన ఆభరణాలను దొంగిలించి తెలివిగా తప్పించుకునే ప్రయత్నం చేసిన ముఠా చిన్న పొరపాటుతో పోలీసులకు చిక్కింది. ముఠా సభ్యుల్లో ఒక్కడు సెల్ ఆన్ చేయడంతో పోలీసులకు వాళ్లు పట్టుబడ్డారు.
హైదరాబాద్: లక్షల విలువైన ఆభరణాలను దొంగిలించి తెలివిగా తప్పించుకునే ప్రయత్నం చేసిన ముఠా చిన్న పొరపాటుతో పోలీసులకు చిక్కింది. ముఠా సభ్యుల్లో ఒక్కడు సెల్ ఆన్ చేయడంతో పోలీసులకు వాళ్లు పట్టుబడ్డారు. హైదరాబాదులోని పంజాగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన భారీ చోరీ కేసులో నిందితులను పోలీసులు పట్టుకున్నారు.
చోరీ ఘటన, నిందితుల పరారీ, వారికి అదుపులోకి తీసుకున్న తీరును డీసీపీ వెంకటేశ్వర్రావు, పంజాగుట్ట ఏసీపీ వెంకటేశ్వర్లు పంజాగుట్ట పోలీస్స్టేషన్లో మంగళవారం మీడియాకు వివరించారు. నిందితులంతా బీహార్కు చెందినవారే.
నవీన్నగర్కు చెందిన వ్యాపారి జితేంద్రకుమార్ గుప్తా ఇంటిలో ఉమేష్ కుమార్ ముకియా కబాద్(23) వంటమనిషిగా చేరాడు. చేరిన నెలలోపే ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు.యజమాని కుటుంబసభ్యులతో బయటికి వెళ్లిన సమయంలో ఉమేష్ ఫిలింనగర్లో ఒకరింట్లో వంటమనిషిగా పనిచేసే హరేరామ్ సహానే మిస్సర్తో కలిసి పథకం వేసి అమలు చేశారు.
మరో ముగ్గురినిపిలిపించుకున్నారు...
వారిద్దరరు హైదరాబాదు నగరంలో ఉంటున్న బిహార్కు చెందిన జోగిందర్ ముకియా(25), ఉపేందర్ ముకియా(21), రాజేందర్ ముకియా(33)కు తమ పథకం చెప్పారు. ఇందులో రాజేందర్ ముకియా కారు డ్రైవర్గా పని చేస్తుండగా మిగతా నలుగురూ వంటపని చేసేవారు. జోగిందర్, ఉపేందర్, రాజేందర్ ముగ్గురు అన్నదమ్ములు.
కాపలా పెట్టి దొంగతనం...
జితేంద్రకుమార్ కుటుంబం శుభకార్యానికి వెళ్లడంతో జులై ఒకటిన రాత్రి ఉమేష్కుమార్, హరేరామ్, జోగిందర్ ముకియా, ఉపేందర్ ముకియాలు సుత్తి, ఉలి సాయంతో కిటికీ గ్రిల్స్ను తొలగించి ఇంట్లోకి ప్రవేశించారు. రాజేందర్ ముకియా బయట కాపలా ఉన్నాడు. ఇంట్లోకి వెళ్లిన వారు మొదటి, రెండో అంతస్తుల్లోని అల్మారాల్లోంచి ఆభరాణాలతోపాటు నగదు, గడియారాలు ఎత్తుకెళ్లారు. 2వ తేదీ ఉదయం ఇంటికి వచ్చిన జితేంద్రకుమార్ ఇంట్లో దొంగతనం జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇలా చేశారు...
చోరీకి పాల్పడిన అయిదుగురు మాదాపూర్లోని రాజేందర్ ముకియా ఇంటికి వెళ్లారు. అక్కడ దొంగిలించిన సొమ్ము సంచుల్లో నింపుకుని అక్కడి నుంచి క్యాబ్ తీసుకున్నారు. పోలీసులకు దొరక్కుండా ఉండాలని మొబైల్ ఫోన్లను ఆఫ్ చేశారు. క్యాబ్లో ఉప్పల్కు వెళ్లారు. అక్కడ నుంచి బస్సు ఎక్కి వరంగల్ చేరుకున్నారు. వరంగల్ నుంచి బస్సు ద్వారా విజయవాడ చేరారు. అక్కడి నుంచి విశాఖ చేరుకుని అక్కడి నుంచి గౌహతి రైలు ద్వారా బిహార్కు వెళ్లేందుకు సిద్ధమై రైల్వేస్టేషన్లో నించున్నారు.
ఫోన్ ఆన్ చేశాడు...
విశాఖకు వెళ్లిన తర్వాత నిందితుల్లో ఒకతను ఫోన్ ఆన్ చేసి వెంటనే ఆఫ్ చేశాడు. దాంతో వారు ఎటు వెళ్తున్నారో పోలీసులకు తెలిసిపోయింది. వెంటనే పోలీసులు ఆ సమయంలో విజయవాడ నుంచి బిహార్కు వెళ్లే రైళ్ల వివరాలను సేకరించారు. విశాఖ కమిషనర్తో, నేరపరిశోధన విభాగం అధికారులతో పంజగుట్ట పోలీసులు మాట్లాడారు.వారి ఫొటోలు వాట్సప్ ద్వారా పంపారు. పోలీసులు తనిఖీలు చేస్తున్న సమయంలో నిందితులను గుర్తించారు.జోగిందర్ ముకియా తప్పించుకున్నాడు. మిగిలిన నలుగురు పోలీసులకు చిక్కారు.
ఆభరణాలు, వస్తువులు ఇవీ..
నిందితుల నుంచి 1.295 కిలోల బంగారు ఆభరణాలు, 2.8కిలోల వెండి ఆభరణాలు, 25 ఖరీదైన గడియారాలు, రూ.65వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటన్నింటి విలువ దాదాపు రూ.65 లక్షలు ఉంటుందని డీసీపీ చెప్పారు. మిగతా కొంత సొత్తు దొరకాల్సి ఉన్నట్లు సమాచారం.
గంటల్లోనే ఛేదించారు...
బాధిత యజమానిని మరోసారి విచారించి చోరీకి గురైన సొత్తు విషయంలో స్పష్టత తీసుకుంటామని డీసీపీ తెలిపారు. 24 గంటలు తిరగకముందే ఈ కేసును ఛేదించినట్లు డీసీపీ తెలిపారు. ఈ కేసులో కృషి చేసిన పోలీసు అధికారులకు రివార్డులు అందిస్తామని చెప్పారు. పట్టుబడిన వాటిలో పురాతన వెండి నాణేలు కూడా ఉన్నాయి.