తెలంగాణలో ఒమిక్రాన్ వేరియంట్ కలకలం: మరో నాలుగు కొత్త కేసులు, మొత్తం 7కి చేరిక
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలకలం సృష్టిస్తోంది. రాష్ట్రంలో క్రమంగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో మూడు ఒమిక్రాన్ కేసులను గుర్తించి.. తాజాగా మరో నలుగురు ఒమిక్రాన్ వేరియంట్ బారినపడ్డారు.
Recommended Video

ఎట్ రిస్క్ దేశాల నుంచి.. తెలంగాణలో కొత్తగా 4 ఒమిక్రాన్ కేసులు
ఎట్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన వారిలో కొత్తగా మరో నలుగురికి ఒమిక్రాన్ పాజిటివ్గా తేలింది. కెన్యా నుంచి వచ్చిన ముగ్గురిలో, మన దేశంలో ఇతర రాష్ట్రానికి చెందిన మరో వ్యక్తిలోఒమిక్రాన్ వేరియంట్ గుర్తించారు. దీంతో ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో నమోదైన మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 7కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ గురువారం సాయంత్రం బులిటెన్ విడుదల చేసింది.

మరో ముగ్గురి ఫలితాలు రావాల్సి ఉంది..
ఇప్పటి వరకు ఎట్ రిస్క్ దేశాల నుంచి 6,764 మంది ప్రయాణికులు రాష్ట్రానికి రాగా.. వారిలో 21 మందికి ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో కరోనా పాజిటివ్గా తేలింది. వీరందరి నమూనాలను జీనోమ్ సీక్వీన్సింగ్ కోసం అధికారులు పంపించారు. వాటిలో ఇప్పటికే 17 మందికి ఒమిక్రాన్ నెగిటివ్ వచ్చింది. మరో ఏడుగురికి ఒమిక్రాన్ పాటివ్గా నిర్ధారణ అయ్యింది. మరో ముగ్గురి ఫలితాలు రావాల్సి ఉంది. రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే, అధికారులు మాత్రం ఆందోళన అవసరం లేదని, జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించాలని చెబుతున్నారు.

తెలంగాణ కొనసాగుతున్న కరోనా వ్యాప్తి.. కొత్తగా 190 కేసులు
మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ కేసుల వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 40,103 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 190 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 6,79,064కి చేరింది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. బుధవారం కరోనాతో ఇద్దరు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన మృతుల సంఖ్య 4012కి చేరింది. కరోనా బారి నుంచి బుధవారం 195 మంది కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 3805 యాక్టివ్ కేసులున్నాయి.

కంటైన్మెంట్ జోన్గా టోలిచౌకి పారామౌంట్ కాలనీ
అంతకుముందు హైదరాబాద్లో రెండు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదు కావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ క్రమంలోనే మెహిదీపట్నంలోని టోలిచౌకి పారామౌండ్ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్గా ప్రకటించారు జీహెచ్ఎంసీ అధికారులు. ఆ రెండు కేసులు వెలుగుచూసిన పారామౌంట్ కాలనీలో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. వైద్య ఆరోగ్య శాఖ నుంచి ప్రత్యేక టీమ్లు రంగంలోకి దిగనున్నాయి. ఆ కాలనీలో మరింత మంది ప్రైమరీ కాంటాక్ట్స్ను గుర్తించి పరీక్షలు చేయనున్నారు. బాధితులు కలిసిన, సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించే పనిలో పడ్డారు అధికారులు. ఒమిక్రాన్ కేసులు బయటపడినవారి నివాసాలకు సమీపంలోని 25 ఇళ్ల పరిధిలో కంటైన్మెంట్ జోన్ ఏర్పాటు చేశారు. డిసెంబర్ 12న కెన్యా, సోమాలియా దేశాల నుంచి నగరానికి వచ్చిన ఇద్దరికి ఒమిక్రాన్ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. వారిని గచ్చిబౌలిలోని టిమ్స్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, దేశంలోని పలు రాష్ట్రాల్లో కూడా కరోనా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి. ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో కొత్త గా నమోదైన కేసులతో దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 87కి చేరింది.












Click it and Unblock the Notifications