నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. టైరు పేలటంతో కారు అదుపుతప్పి నలుగురు దుర్మరణం
ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదం ఘటనలు వణికిస్తున్నాయి. ఎక్కడ రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నా పెద్ద సంఖ్యలో వాహనదారులు మృతిచెందటం ఆందోళన కలిగిస్తుంది. ఇటీవల తిరుమల దర్శనానికి వెళుతుండగా ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగి ఐదుగురు దుర్మరణం పాలైన ఘటన మరిచిపోకముందే, తాజాగా నిజామాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది.
నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నిజామాబాద్ జిల్లా ముప్కాల్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాద దుర్ఘటనలో టైరు పేలడంతో కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉండడం ఆవేదన కలిగిస్తోంది. హైదరాబాద్ నుండి నిర్మల్ కు కారులో వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వేగంతో ప్రయాణిస్తున్న క్రమంలో కారు టైరు పేలింది. దీంతో కారు ఒక్కసారిగా అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. కారు గాల్లోకి ఎగిరి పల్టీలు కొట్టి డివైడర్ ను దాటి అవతల రోడ్డుపై పడిపోయింది.
ఘటనలో కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు. మొత్తం ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఏడుగురు వున్నట్టు తెలుస్తుంది. స్థానికులు అందించిన సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. వీరి పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
అతివేగమే ప్రమాదానికి కారణమా? లేక కారు టైరు పేలడంతో డివైడర్ ను ఢీ కొట్టి ప్రమాదం జరిగిందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీరు హైదరాబాద్ నుంచి నిర్మల్ కి ఎందుకు వెళ్తున్నారు? అన్నది కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతి చెందిన వారు ఒకే కుటుంబానికి చెందిన వారా అన్నది కూడా పోలీసులు సమగ్ర సమాచారాన్ని సేకరిస్తున్నారు.