నాపై జరిగిన కాల్పుల ఘటనపై విచారణ చేయాలి: గద్దర్ డిమాండ్
హైదరాబాద్: కోదండరామ్ పార్టీకి ప్రజల్లో స్థానం ఉందో తెలియదుగానీ, తాను ఏర్పాటు చేసిన పార్టీకి ప్రజల మద్దతు ఉందని ప్రజా యుద్దనౌక గద్దర్ వ్యాఖ్యానించారు.తెలంగాణ జెఎసి ఛైర్మెన్ కోదండరామ్ సోమవారం నాడే తన పార్టీ పేరును ప్రకటించిన విషయం తెలిసిందే.
మంగళవారం నాడు తెలంగాణ సెక్రటేరియట్లో సీఎస్ ఎస్కె జోషీని కలిసేందుకు గద్దర్ వచ్చారు. సీఎస్ లేకపోవడంతో సీఎంఓలో వినతిపత్రం ఇచ్చారు. తనపై కాల్పులు జరిగి సుమారు 22 ఏళ్ళు అవుతోందని గద్దర్ చెప్పారు. ఈ ఘటనపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ విషయమై విచారణను కోరుతూ తాను రాష్ట్రపతికి కూడ లేఖ రాసినట్టుగా ఆయన గుర్తు చేశారు.తనకు లేఖకు స్పందించిన రాష్ట్రపతి ప్రధానికి కూడ లేఖ రాశారని చెప్పారు.
ఈ విషయమై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రధాని కార్యాలయం నుండి సీఎస్కు లేఖ వచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కానీ, ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు మీనమేషాలు లెక్కిస్తోందని గద్దర్ ఆరోపించారు.
తనపై కాల్పుల ఘటనకు సంబంధించి ప్రభుత్వం స్పందించకపోతే తాను న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని గద్దర్ ప్రకటించారు.గద్దర్ ఆరు మాసాల క్రితం ఓ పార్టీని ఏర్పాటు చేశారు.ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ఆయన పర్యటిస్తున్నారు.