కేసీఆర్ పై గద్దర్ గళం..! ఎన్నికల ప్రచారంలో ఉర్రూతలూగించనున్న పాట..!!
హైదరాబాద్: తెలంగాణ జానపదం మీద ప్రజాగాయకుడు గద్దర్ ముద్ర చాలా వరకు ఉంటుంది. తలెంగాణ సమాజం మీద కూడా గద్దర్ గళం నుండి జాలువారే గాత్రానికి ప్రజానికం మైమరిచిపోతుంటారు. పాటలోని ఇతివ్రుత్తానికి దాసోహం అన్నంతగా ఆ పాటను ఓన్ చేసుకుంటారు. అందుకే ఆ రోజుల్లో బండెనకబండి గట్టీ పదహారు బళ్లు గట్టీ, అని పాడినా., మదనా సుందారి మదనా సుందారి అని అందుకున్న పాటలను గుండెల్లో పెట్టుకున్నారు తెలంగాణ ప్రజలు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో పోరు తెలంగాణమా అని గద్దర్ పాడిన పాట చాలా ప్రభావం చూపించింది. తన పాటతో అంతటి మార్పు తీసుకురాగల ప్రజా గాయకుడు గద్దర్ తాజాగా తెలంగాణ ఆపథర్మ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పై ఓ కొత్త ప్రయోగం చేయబోతున్నారు. కేసీఆర్ పరిపాలన ఏ విధంగా ఉందో తెలంగాణ ప్రజానికాని తన పాట రూపంలో వినిపించబోతున్నారు గద్దర్. కేసీఆర్ పైన పాడుతున్న గద్దర్ పాట ఎలాంటి సచలనాలు స్రుష్టిస్తుందోనని ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నట్టు తెలుస్తోంది.
తెలంగాణ ఉద్యమంలో గద్దర పాట ప్రభావం..! ఆకర్శితులైన ప్రజానికం..!!
తెలంగాణ ఉద్యమ సమయంలో గద్దర్ పాడిన ‘పొడుస్తున్న పొద్దుమీద' పాట తెలంగాణవాసుల్లో చైతన్యాన్ని తీసుకువచ్చి, పోరుబాటకు ఉసిగొలిపిన విషయం తెలిసందే. అలాగే ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి పాటలే ఊపిరిపోశాయని అంటుంటారు. ప్రజా గాయకులు గద్దర్, విమలక్క, బండియాదగిరి, గోరంటి వెంకన్న, గూడ అంజయ్య, అందెశ్రీ స్వయంగా రాసి, ఆలపించిన పాటలు ప్రజల్లో ఉద్యమస్ఫూర్తిని రగిలించడంతోపాటు, వారిని ఉద్యమంలో భాగస్వాములుగా చుసాయి. ‘తెలంగాణ ధూమ్ధామ్'పేరుతో ఈ గాయకులు పాడిన పాటలు తెలంగాణ ప్రజల హృదయాల్లో చెరగని ముద్రవేశాయి.
ఉద్యమాలకు పాటలు ఊపిరన్న కేసీఆర్..! ఇప్పుడు తనమీదే వస్తున్న పాట..!!
అప్పట్లో ఉద్యమరథసారధిగా వ్యవహరించిన టిఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కూడా ఆ నాటి పాటలను, గాయకులను మెచ్చుకున్న సందర్భాలున్నాయి. ఈ పాటలు కేసీఆర్ అధికారంలోకి వచ్చేందుకు దోహదపడ్డాయని చెబుతుంటారు. ఉద్యమం సందర్బంగా గద్దర్ పాడిన పొడుస్తున్న పొద్దుమీద పాట స్థానికులపై విపరీతమైన ప్రభావాన్ని చూపింది. ఇదే కోవలో గోరేటి వెంకన్నరాసిన ‘పల్లె కన్నీరు పెడుతుందో..', ‘అందెశ్రీ' రాసిన ‘జయ జయహె తెలంగాణ, ‘జయరాజ్' పాడిన ‘వానమ్మా..వానమ్మా', ‘విమలక్క' ఆలపించిన ‘మత్తుడి దునికి అలుగు తన్నుకుని పారినట్లు', మొదలైన పాటలు తెలంగాణ ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలించాయి.
కేసీఆర్ పాలనపై గద్దర్ పాట..! ఏ పరిణామాలకు దారితీస్తుందోనని ఉత్కంఠ..!!
ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రజా పోరును ఆసరాగా చేసుకుని కేసీఆర్ గద్దెనెక్కారు. తెలంగాణలో పాటల తీరు తెన్నులు కూడా మారిపోయాయి. ప్రభుత్వ వ్యతిరేక పాటలు పుట్టుకు వస్తున్నాయి. ఇవి ప్రజలకు వాస్తవాలను చూపిస్తూ, వారి కళ్లు తెరిపించేందుకు దోహదపడుతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఏపూరి సోమన్న టిఆర్ఎస్ ప్రభుత్వానికి, కేసీఆర్ కు వ్యతిరేకంగా పాడుతున్న పాటలు పార్టీ వర్గాలను వణికిస్తున్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా ఇటీవలికాలంలో తెలంగాణలో ‘ఎవడి పాలయిందిరో...తెలంగాణ' అనే పాట ఎంతో ప్రజాదరణ పొందుతోంది.
కేసీఆర్ ఇప్పటికే అనేక పాటలు..! గద్దర్ పాట ప్రభావం ఎక్కువ అంటున్న నేతలు..!
పైగా ఈ పాట విన్న ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా ముందు ఈ పాటను ప్రస్తావిస్తూ ఈ మధ్య ‘ఎవడి పాలయింది..తెలంగాణ...అంటూ పాడుతున్నారు. అయితే తెచ్చిన వాడే ఏలుతున్నాడని, ఘాటుగా సమాధానమిచ్చారు. ముందస్తు ఎన్నికల సమయంలో ఈ పాట కెసిఆర్ను వణికిస్తున్నదనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనికితోడు కాంగ్రెస్ ఇటీవలి కాలంలో ఎక్కడ సభలు పెట్టినా ఈ పాటను గాయకుల చేత పాడిస్తూ ప్రజలను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ పాటను కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో విరివిగా వాడుకుంటోంది. దీనితోపాటు మరికొన్నకేసీఆర్ ప్రభుత్వ వ్యతిరేక పాటలు కూడా టీఆర్ ఎస్ శ్రేణుల్లో వణుకుపుట్టిస్తున్నాయట. పాలకుల గుండెల్లో తూటాల్లా దూసుకుపోతున్న ఇటువంటి పాటలు పార్టీకి చేటు చేయనున్నాయని ఆ పార్టీ నేతలు వాపోతున్నారట. ఈ నేపథ్యంలో చంద్రశేఖర్ రావు పై గద్దర్ పాట ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో నని ప్రగతిభవన్ వర్గాల్లో కలవరం మొదలైనట్టు చర్చ జరుగుతోంది.