సొంత ఇలాకాలో సీఎంకు షాక్: కెసిఆర్ కిడ్నీ అమ్మేస్తారు.. రేవంత్
మెదక్/వరంగల్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రాతినిథ్యం వహిస్తున్న మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో ప్రతిపక్షాలు శనివారం నాడు బంద్ చేపట్టాయి. ఇది విజయవంతమైంది. గజ్వేల్ - ప్రజ్ఢాపూర్ నగర పంచాయతీ పరిధిలో ఆస్తి పన్నుల పెంపు నిరసిస్తూ ప్రతిపక్షాలు బందుకు పిలుపునిచ్చాయి.
విద్యా, వ్యాపార, వాణిజ్య సముదాయాల యజమానులు స్వచ్చంధంగా బందులో పాల్గొన్నారు. కొన్నిచోట్ల టిడిపి, కాంగ్రెస్, సిపిఎం నాయకులు తెరిచి ఉన్న దుకాణాలను మూయించారు. బందుకు పిలుపునిచ్చిన తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షులు వంటేరు ప్రతాప్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి దౌల్తాబాద్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా వంటేరు మాట్లాడారు. ప్రభుత్వం ప్రజాహక్కులను కాలరాస్తోందని, తాము నిరసన తెలిపితే అరెస్టు చేయడం దారుణమన్నారు. దాదాపు 70 మంది కార్యకర్తలను అరెస్టు చేయడంపై వంటేరు ఘాటుగా స్పందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ నగరపంచాయతీలో పన్నుల విపరీతంగా పెంచారని విచారం వ్యక్తం చేశారు.
పెంచిన పన్నులు తగ్గించాలని శాంతియుతంగా బంద్ చేస్తుంటే టిడిపి నాయకులను, కార్యర్తలను అరెస్టు చేయించడం అప్రజాస్వామ్యమన్నారు. స్వచ్ఛందంగా బంద్ పాటించిన వ్యాపారులు, దుకాణాలు, హోటళ్లను పోలీసులు దగ్గరుండి తెరిపించారని విమర్శించారు.
ప్రజల కోసం పని చేసే ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా బలమైన, దీటైన ప్రతిపక్షం ఉండాలని కోరుకుంటారని, అయితే సీఎం కేసీఆర్ దీనికి భిన్నంగా వ్యవహరిస్తున్నారన్నారు. పేదలకు రెండు పడక గదుల ఇళ్లు, ఎస్సీ, ఎస్టీలకు మూడెకరాల సాగుభూమి అందించడంలో ప్రభుత్వం తాత్సారం చేస్తోందని దుయ్యబట్టారు.
వరంగల్లో రేవంత్ రెడ్డి ప్రచారం
తెలంగాణ రాష్ట్రానికి రెండో దుష్టచతుష్టయం ఏర్పడిందని టిడిపి నేత రేవంత్ రెడ్డి శనివారం మండిపడ్డారు. కడియం శ్రీహరి, ఎర్రబెల్లి దయాకర్ రావులు ఎంతటి ఘనులంటే, కేసీఆర్ ఆదమరిచిన వేళ ఆయన కిడ్నీలను అమ్మేసే రకమన్నారు. హరీశ్ రావు చెప్పేవన్నీ ఉడుత ఊపు మాటలే అన్నారు.
ఇప్పటివరకూ కేసీఆర్, కేటీఆర్, హరీశ్, కవితల దుష్టచతుష్టయం ఉందనుకున్నానని, ఇప్పుడు కడియం, ఎర్రబెల్లి, కొండా మురళి, వినయ్ భాస్కర్లు వరంగల్ ప్రాంతంలో ఒకే పార్టీలో కలిసి మరో దుష్టచతుష్టయంగా తయారయ్యారన్నారు.నాడు కొట్టుకుని, తిట్టుకున్న నేతలు, నేడు కలిసి ఎలా పని చేయగలరన్నారు.
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన అరవై వేల ఇళ్లను సీఎం కేసీఆర్ ఎక్కడ నిర్మించారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో వంద అడుగుల వెడల్పుతో 240 అడుగులలోతు బావిని తవ్వడంతో ఎర్రవల్లి గ్రామంలోని బావుల నీరు అంతా ఇంకిపోయిందన్నారు.
అది కప్పిపుచ్చుకోవడానికి ఆ గ్రామస్థులందరికీ రెండు పడకల ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. సీఎం కేసీఆర్ భూమిలో నుంచి పైపులైను వేసి ఆయన బావిలోకి కలిపారన్నారు. 240 అడుగుల బావి తవ్వేందుకు అనుమతి ఉందా? అని ప్రశ్నించారు.
33 ఏళ్లు టిడిపితో ఎదిగి పదవులు, అధికారం అనుభవించిన ఎర్రబెల్లి, కడియం శ్రీహరిలు... సీఎం కేసీఆర్ నిద్రిస్తున్న సమయంలో చెరో కిడ్నీ తీసుకొని అమ్ముకునే రకాలు వాళ్లు అని ఎద్దేవా చేశారు. నూతనంగా నిర్మించిన వరంగల్ జిల్లా టిడిపి కార్యాలయాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.