కెసిఆర్ భాషతో గౌరవం పోతోంది: గాలి, వర్ల ఫైర్, బాబుకే ఓట్లడిగే హక్కు
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుపై ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కెసిఆర్ ఉపయోగిస్తున్న భాషతో సీఎం పదవికి ఉండే గౌరవాన్ని దిగజారుస్తున్నారని టిడిపి నేతలు గాలి ముద్దు కృష్ణమనాయుడు, వర్ల రామయ్య విమర్శించారు.
హైదరాబాద్ను అభివృద్ధి చేశారు కనుకనే చంద్రబాబు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలను ఓట్లు అడుగుతున్నారని చెప్పారు. దేశంలో ఎక్కడైనా ఏ రాజకీయపార్టీ అయినా ప్రచారం నిర్వహించుకోవచ్చని గుర్తుచేశారు.
కాంగ్రెస్ను గద్దె దించడానికే ఎన్టీఆర్ టిడిపిని స్థాపించి దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారని చెప్పారు. కేంద్రంతో పోరాడి 10లక్షల ఐటీ ఉద్యోగాలు రాష్ట్రానికి తెచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు.
భువనేశ్వరి టిడిపికి ఓటేస్తారని కేసీఆర్ చెప్పడం మైండ్గేమ్లో భాగమని పేర్కొన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని అనే విషయాన్ని టిఆర్ఎస్ నేతలు గుర్తుంచుకోవాలని సూచించారు.
కూటమితోనే అభివృద్ధి
బిజెపి-టిడిపి కూటమితోనే హైదరాబాద్ సమగ్ర అభివృద్ధి సాధ్యమని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. గతంలో ఈవిషయం నిరూపితమైందని చెప్పారు. మొగల్పుర, సైదాబాద్, ఓల్డ్ మలక్పేటలో నిర్వహించిన జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో జవదేకర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్, మజ్లీస్, టిఆర్ఎస్ పార్టీలపై విమర్శలు గుప్పించారు. అభివృద్ధి పథంలో ఉన్న భాగ్యనగరాన్ని కాంగ్రెస్, మజ్లీస్ కూటమి భ్రష్టు పట్టించిందని ధ్వజమెత్తారు. ఆ పార్టీల పదేళ్ల పాలన వల్ల హైదరాబాద్ సమస్యల నిలయంగా మారిందన్నారు. ప్రజలు విజ్ఞతతో ఆలోచించి బిజెపి-టిడిపి కూటమికి ఓటేయాలని కోరారు.