సినీ ఫక్కీలో గంజాయి ఛేజింగ్: విశాఖ టూ మధ్యప్రదేశ్, జయశంకర్ జిల్లాలోనూ భారీగా గంజాయి పట్టివేత
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా గంజాయి గుప్పుమంటోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ ఏజెన్సీ కేంద్రంగా వేల ఎకరాల్లో సాగవుతున్న గంజాయి దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలకు అక్రమ రవాణా అవుతోంది. గంజాయిని అరికట్టడం కోసం, గంజాయి స్మగ్లింగ్ పై ఉక్కుపాదం మోపడం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేసినా, పోలీసులకు నిఘా వర్గాలకు చిక్కకుండా గంజాయి దందా చాపకింద నీరులా విస్తరిస్తూనే ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఇతర రాష్ట్రాల్లోనూ గంజాయి కేసులు నిత్యకృత్యంగా మారాయి. దేశంలో ఎక్కడ గంజాయి పట్టిబడినా ఆ గంజాయి మూలాలు విశాఖ ఏజెన్సీలోనే ఉండటం ప్రధానంగా కనిపిస్తుంది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గంజాయి ముఠా అరెస్ట్
తాజాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల పరిధిలో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. గణపురం మండలం గాంధీనగర్ క్రాస్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులకు చిక్కకుండా గంజాయి ముఠా తప్పించుకునే ప్రయత్నం చేసింది. రెండు వాహనాల్లో తరలిస్తున్న 4.05 క్వింటాళ్ల ఎండు గంజాయిని, పోలీసులు వెంబడించి మరీ పట్టుకున్నారు. పోలీసులు సీజ్ చేసిన గంజాయి విలువ 80 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
గంజాయి దందా చేస్తే కఠిన చర్యలు .. ఎస్పీ వార్నింగ్
ఐదుగురు నిందితుల్లో ముగ్గురిని రిమాండ్ కు తరలించగా, ఇద్దరు పరారీలో ఉన్నట్టు గా జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ తెలిపారు. ఎవరైనా గంజాయి అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, గంజాయి సాగు చేసిన వారిని ఉపేక్షించేది లేదని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ తేల్చి చెప్పారు. గంజాయి అక్రమ రవాణా, సాగుపై సీఎం కేసీఆర్ ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని ఆదేశాలు జారీ చెయ్యటంతో అడుగడుగునా నిఘా పెట్టి మరీ గంజాయి అక్రమ రవాణా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.
అరటికాయల లోడులో విశాఖ టూ మధ్యప్రదేశ్ కు గంజాయి
ఇదిలా ఉంటే విశాఖపట్నం నుండి అరటికాయల లోడులో తరలిస్తున్న టన్ను గంజాయిని మధ్యప్రదేశ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భిండ్ జిల్లా పరిధిలో మలన్ పుర పోలీసులు మరియు సైబర్ విభాగం అధికారులు సంయుక్తంగా నిర్వహించిన దాడిలో అరటికాయ లోడు మాటున అక్రమంగా తరలిస్తున్న టన్ను గంజాయి వెలుగుచూసింది. పోలీసులకు అందిన ముందస్తు సమాచారం ప్రకారం అర్ధరాత్రి దాటిన తర్వాత మలన్ పురా పారిశ్రామిక ప్రాంతంలో నిఘా వేసి మరీ పోలీసులు లారీని పట్టుకున్నారు. అరటికాయల లోడుతో ఉన్న ఆ వాహనంలో సీక్రెట్ గా దాచిన దొంగచాటుగా రవాణా చేస్తున్న గంజాయిని గుర్తించారు.దీని విలువ రెండు కోట్ల రూపాయలు ఉంటుందని చెప్తున్నారు.
Recommended Video
పట్టుకున్న భిండ్ పోలీసులు .. ఏపీ నుండి ఎంపీకి వెళ్తున్నట్టు చెప్పిన స్మగ్లర్లు
ఈ వాహనం తో పాటు ఉన్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, ఈ గంజాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుండి మధ్యప్రదేశ్ రాష్ట్రానికి వెళుతుందని వారు వెల్లడించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల అమెజాన్ ద్వారా గంజాయి దందా జరుగుతుందని గుర్తించి, ఈ కామర్స్ ద్వారా జరుగుతున్న గంజాయి దందాను వెలుగులోకి తెచ్చింది కూడా భిండ్ పోలీసులే కావడం గమనార్హం. ఏదిఏమైనప్పటికీ తెలుగు రాష్ట్రంలోనే కాదు దేశ వ్యాప్తంగా ఏపీ గంజాయి విచ్చలవిడిగా అక్రమ రవాణా జరుగుతోంది. ఎక్కడ చూసినా గంజాయి గుప్పుమంటోంది. ఇక గంజాయి స్మగ్లింగ్ ను అడ్డుకోవటం పోలీసులకు పెద్ద టాస్క్ గా మారింది.