ఓయు పరిస్థితి చూసి చలించిపోయా: గీతారెడ్డి, తెలంగాణలో జగన్ పార్టీ ధర్నా
హైదరాబాద్/ కరీంనగర్: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో దుర్భర పరిస్థితులు చూసి తాను చలించిపోయానని మాజీ మంత్రి, కాంగ్రెసు నాయకురాలు గీతారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం ఓయూ హాస్టళ్లను కాంగ్రెస్ నేతలు గీతారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పద్మావతి, సంపత్కుమార్, చిన్నారెడ్డిలు పరిశీలించారు.
ఈ సందర్భంగా గీతారెడ్డి మాట్లాడారు. బంగారు తెలంగాణ అంటే మెస్లు తెరవకపోవడమేనా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఓయూపై ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీస్తామని ఆమె తెలిపారు. విద్యార్థుల అండతో అధికారానికి వచ్చిన ప్రభుత్వం, విద్యార్థుల సమస్యలను పట్టించుకోకపోవడం దారుణమని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆరోపించారు.
కాగా, వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తెలంగాణలో ఆందోళనలకు శ్రీకారం చుట్టింది. రైతుల ఆత్మహత్యలను అరికట్టడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శుక్రవారంనాడు కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించింది. వైసిపి నేతలు రైతులతో ర్యాలీగా వెళ్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు.
రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశఆరు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు ప్రత్యేక సాయం అందించాలని కోరారు. ఈ ధర్నాలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లా సూర్యప్రకాష్, జిల్లా పార్టీ అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు బోయినపల్లి శ్రీనివాస రావు, అక్కినేపల్లి కుమార్ తదితరులు పాల్గొన్నారు.