ముత్తాత ఇచ్చిన 2 గుంటలే నా ఆస్తి... మీకోసం పనిమనిషిలా పనిచేస్తా : హుజురాబాద్లో గెల్లు శ్రీనివాస్
హుజురాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా తనకు అవకాశం ఇచ్చినందుకు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ముఖ్యమంత్రి కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. తాను అత్యంత పేద కుటుంబంలో పుట్టిన బిడ్డను అని... ఇప్పటికీ కేవలం రెండు గుంటల భూమి మాత్రమే తన పేరిట ఉందని చెప్పారు. వీణవంక మండలం హిమ్మత్ నగర్ గ్రామంలో పుట్టిన తాను దళిత బహుజన విప్లవోద్యమాల స్పూర్తితో విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొన్నానని చెప్పారు. బడుగు బలహీనవర్గాల విద్యార్థుల స్కాలర్షిప్స్ కోసం టీడీపీ,కాంగ్రెస్ ప్రభుత్వాలపై పోరాడి జైలుకు కూడా వెళ్లానని చెప్పారు. కేసీఆర్ స్పూర్తితో తెలంగాణ ఉద్యమంలోకి వచ్చి ఆయన మార్గదర్శకత్వంలో రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాడానని తెలిపారు. హుజురాబాద్ నియోజకవర్గంలోని ఇల్లందకుంటలో నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.
'సోదరులారా,సోదరీమణులారా... నేను అత్యంత పేద కుటుంబంలో పుట్టిన బిడ్డను. వీణవంక మండలం హిమ్మత్ నగర్ బిడ్డను. నాకు ఆస్తిపాస్తులేవీ లేవు. మా ముత్తాత సంపాదించిన ఆస్తిలో నా వంతుగా కొండపాకలో రెండు గుంటల భూమి వచ్చింది. పేద కుటుంబం నుంచి వచ్చిన నన్ను కేసీఆర్ ఆశీర్వదించి మీ వద్దకు పంపించారు. ఏ నమ్మకం పెట్టుకుని నాకు అవకాశం ఇచ్చారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. మీకు అందుబాటులో ఉంటాను. మీ తల్లో నాలుకలా ఉంటాను. మీ మధ్యే ఉంటూ... మీకోసం ఒక పనిమనిషిలా పనిచేస్తాను. మీ అందరు నన్ను ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన కేసీఆర్కు పాదాభివందనాలు...' అని గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.

సీఎం కేసీఆర్ మొదటి నుంచి విద్యార్థి ఉద్యమకారులకు అవకాశాలిస్తున్నారని గెల్లు శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పార్టీలో,ఉద్యమంలో తన కృషిని గుర్తించి హుజురాబాద్లో పోటీ చేసే అవకాశం కల్పించారని పేర్కొన్నారు. ఇప్పటివరకూ వేరే పార్టీ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించలేదు కాబట్టి ప్రత్యర్థులపై ఇప్పుడే తానేమీ మాట్లాడదలుచుకోలేదని చెప్పారు.
ఇదే సమావేశంలో టీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ... ఎలక్షన్ రాకముందే హుజురాబాద్లో ఈటల రాజేందర్ గెలుస్తాడని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. అందుకే ఆ పార్టీని వీడిని బయటకొచ్చా. గెల్లు శ్రీనివాస్ యాదవ్ను హుజురాబాద్లో గెలిపించి కేసీఆర్కు గిఫ్ట్ ఇవ్వాలి. ఈటల రాజేందర్ మాట్లాడితే ఆత్మగౌరవం అంటున్నారు. అసలు కేసీఆర్ ఆయనకు ఏం అన్యాయం చేశారు. మంత్రిగా,ఆరుసార్లు ఎమ్మెల్యేగా,టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్గా ఈటలకు కేసీఆర్ అవకాశమిచ్చారని గుర్తుచేశారు. ఎన్ని అవకాశాలిచ్చినా ఈటల హుజురాబాద్ అభివృద్దిని పట్టించుకోలేదన్నారు. ఒక్క పేదవాడికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టించలేదన్నారు. కానీ ఆయన మాత్రం రూ.100 కోట్లతో ఐదెకరాల్లో గడి కట్టుకున్నారని విమర్శించారు.
అంతకుముందు,మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ... హుజూరాబాద్ ఉప ఎన్నికలో రెండు గుంటల భూమి ఉన్న సామాన్యుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్కు, 200 ఎకరాల ఆసామి ఈటల రాజేందర్కు మధ్య పోటీ జరగబోతుందన్నారు.ఎకరం అమ్మి ఎన్నికల్లో గెలుస్తానన్న ఈటలకు మద్దతు తెలుపుతారో.. ఎకరం కూడా లేని ఉద్యమ నాయకుడికి ఓటు వేసి అభివృద్ధికి తోడ్పాటును అందిస్తారో ప్రజలే తేల్చుకోవాలన్నారు.. గెల్లు శ్రీనివాస్ యాదవ్కు కేసీఆర్తో పాటు తామంతా అండగా ఉంటామని అన్నారు. హుజూరాబాద్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని, టీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించాలని హరీశ్రావు కోరారు.












Click it and Unblock the Notifications