4జీ నుండి 5జీ అప్డేట్ చేసుకోవాలని సందేశాలు వస్తున్నాయా? ఆ పనిచేస్తే ఖాతాలు ఖాళీ!!
భారతదేశంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. రోజుకో కొత్త పంథాలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతూనే ఉన్నారు. ప్రజలకు అనుమానం రాకుండా ఖాతాలు ఖాళీ చేసే పనిలో కొత్త వ్యూహాలను అమలు చేస్తున్నారు. ఇప్పుడు దేశంలో కొత్తగా వస్తున్న 5ఈ సేవలను మోసం చెయ్యటానికి వాడుకుంటున్నారు.
కొత్త పంధాలో సైబర్ నేరాలకు తెరతీసిన మోసగాళ్ళు
సైబర్ నేరగాళ్ళు కాస్త ఏమరుపాటుగా ఉన్నా ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. రోజుకో కొత్త పంథాలో సైబర్ నేరాలకు తెరతీసి, జనాలను గందరగోళానికి గురి చేసి అందినకాడికి దోచుకుంటున్నారు. ప్రభుత్వాలు, పోలీసులు సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలని విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నా నిత్యం ఎక్కడో ఒకచోట అమాయకులు మోసపోతూనే ఉన్నారు.
4జి నుండి 5జీకి అప్డేట్ చేసుకోవాలంటూ సెల్ ఫోన్లకు సందేశాలు
సోషల్ మీడియాను, డిజిటల్ ప్లాట్ ఫామ్ లను, ఈ కామర్స్ సైట్లను వేటినీ వదలకుండా సైబర్ మోసగాళ్లు నేరాలకు పాల్పడుతున్నారు. ఇక తాజాగా దేశంలో అందుబాటులోకి 5జి సేవలు రావడంతో 4జి నుండి 5జీకి అప్డేట్ చేసుకోవాలంటూ సెల్ ఫోన్లకు సందేశాలను పంపిస్తూ దోపిడీకి తెగబడ్డారు. దేశవ్యాప్తంగా 5జి సేవలు అందుబాటులోకి రావడంతో ఎత్తుగడలు ఎంచుకున్న సైబర్ నేరగాళ్లు టెలికాం కంపెనీల పేరుతోనూ దోపిడీ మొదలు పెట్టారు.
ఆ లింక్ లు ఓపెన్ చేస్తే జరిగేదిదే
4జి మొబైల్ ను 5జీ కి అప్డేట్ చేసుకోవాలని సైబర్ మోసగాళ్లు మెసేజ్ లు పంపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు సైబరాబాద్ పోలీసులు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఒక వీడియోను పోస్ట్ చేసిన పోలీసులు, సైబర్ నేరగాళ్లు పంపిన లింక్ ఓపెన్ చేస్తే ఫోన్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందని, అలర్ట్ గా లేకపోతే ఆపదలో పడినట్లేనని హెచ్చరిస్తున్నారు. మోసగాళ్ల మాయలో పడితే ఖాతాలు ఖాళీ అవుతాయని చెబుతున్నారు.
అప్డేట్ చేసుకోకపోతే సిమ్ పని చెయ్యదు అన్న మెసేజ్ లు నమ్మొద్దు
4జి నుండి 5జి కి అప్డేట్ చేసుకోకపోతే మీ సిమ్ పనిచేయదని సైబర్ నేరగాళ్లు పంపే లింకులను నమ్మకూడదని సూచిస్తున్నారు. టెక్నాలజీ ఎంత పెరుగుతుందో, సైబర్ మోసాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయని, సైబర్ మోసాల పట్ల ప్రజలు కూడా అవగాహన కలిగి ఉండాలని సైబరాబాద్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. మీ సెల్ ఫోన్ కు వచ్చిన టెలికాం కంపెనీల మెసేజ్ ల పై మీకు ఎటువంటి అనుమానం ఉన్నా సంబంధిత టెలిఫోన్ కంపెనీల ప్రతినిధులకు ఫోన్ చేసి అనుమానాలను నివృత్తి చేసుకోవాలని, తొందరపడి ఎటువంటి మెసేజ్ ల లింకులను ఓపెన్ చేయొద్దని సలహా ఇస్తున్నారు.