కోట్లు దోచేసి బాత్రుంలో దాగాడు: బిల్ కలెక్టర్ ఇతడే(పిక్చర్స్)
హైదరాబాద్: ఆదాయానికి మించి ఆస్తులు కూడగట్టిన జిహెచ్ఎంసి ఆబిడ్స్ బిల్ కలెక్టర్ నర్సింహరెడ్డి ఇంటిపై అవినీతి నిరోధక శాఖ దాడులు జరిపింది. ఏసిబి డిఎస్పీ అశోక్కుమార్ నేతృత్వంలో మూడు బృందాలుగా అధికారులు నగరంలోని మూడు ప్రాంతాల్లోవున్న మూడిళ్లపై ఏకకాలంలో దాడులు నిర్వహించి, కోట్ల రూపాయల ఆస్తులున్నట్టు గుర్తించారు.

భారీగా అక్రమాస్తులు
కూకట్పల్లి శాలివాహన నగర్లోని ఆయన ఇంటికి ఏసిబి అధికారులు చేరుకోగానే నర్సింహారెడ్డి తొలుత అడ్డుకునే ప్రయత్నం చేశారు. అధికారులు ఇంటినుంచి వెళ్లిపోవాలని, లేనిపక్షంలో తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ నర్సింహారెడ్డి బాత్రూంలో దాక్కున్నా, పట్టించుకోకుండా అధికారులు తనిఖీలు కొనసాగించారు.

వేర్వేరు చోట్ల ఆస్తులు
కూకట్పల్లి శాలివాహనకాలనీ, బాలానగర్ సమీపంలోని సాయినగర్, జగద్గిరిగుట్టలోని ఇంటితోపాటు ఆయన సొంత గ్రామమైన సిద్దిపేటలోని నంగనూరు, మధిర రామచంద్రపూర్లో కూడా దాడులు నిర్వహించారు. ఇక్కడున్న నర్సింహరెడ్డి బావమరిది శ్రీనివాస్రెడ్డి ఇంట్లో తనిఖీలు నిర్వహించగా, నగదుగానీ, విలువైన డాక్యుమెంట్లుగానీ లభించలేదని ఏసిబి సిఐ నాగేశ్వరరావు తెలిపారు. మదిర రామచంద్రపూర్లోని మరో ఇంటిని సోదాచేయగా, ఒక ఇల్లు,ట్రాక్టరు, 28 ఎకరాల వ్యవసాయ భూమి, తోటలున్నట్టు గుర్తించారు.

రూ. 6కోట్ల పైమాటే..
మొత్తం సోదాల్లో అధికారులు 90 తులాల బంగారం, పది బ్యాంకు ఖాతాల్లో రూ. 16లక్షల నగదున్నట్టు గుర్తించారు. అంతేగాక హైదరాబాద్లో ఐదు ఇళ్లు, ఆయన స్వస్థలమైన సిద్దిపేట నంగనూరులో నాలుగు ప్లాట్లు, 11 ఎకరాల భూమి ఉన్నట్టు గుర్తించిన అధికారులు నగదు, డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం రూ. 6కోట్ల పైచిలుకు ఆస్తులు గుర్తించినట్టు ఏసిబి అధికారులు ప్రకటించారు.

గిట్టని వారిపనేనంటున్నారు..
సోదాలు ఇంకా కొనసాగుతున్నాయని, పూర్తైన వెంటనే ఉన్నతాధికారులకు నివేదిక పంపనున్నట్టు సిద్దిపేటలో దాడులు నిర్వహించిన ఏసిబి అధికారులు తెలిపారు. కాగా, నర్సింహరెడ్డి మాత్రం తాను విధి నిర్వహణలో ఎప్పుడూ అవినీతికి పాల్పడలేదని, భూముల ధరలు తక్కువగా ఉన్నపుడు కొనుగోలు చేసిన తన కుటుంబం ఇపుడు రియల్ ఎస్టేట్ చేసి సంపాదించామని, భూవివాదాల నేపథ్యంలో తామంటే గిట్టనివారు తమపై దాడులు చేయించారని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications