భారీ వర్షాల వేళ- పారిశుద్ధ కార్మికుడిగా జీహెచ్ఎంసీ కమిషనర్
హైదరాబాద్: వర్షాకాలంలో హైదరాబాద్ పరిస్థితి ఎంత అధ్వాన్నంగా తయారవుతుందనేది ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. డ్రైనేజీలన్నీ పొంగిపొర్లుతుంటాయి. రోడ్లన్నీ జలమయం అవుతుంటాయి. వీధులు, కాలనీలు.. నదుల్లా మారుతుంటాయి. ప్రతి వర్షాకాలంలోనూ హైదరాబాద్, సికింద్రాబాద్లల్లో ఇవే తరహా పరిస్థితులు కనిపిస్తుంటాయి.
ఇటీవలే కురిసిన భారీ వర్షానికీ హైదరాబాద్లోని అనేక ప్రాంతాల్లో వరదనీరు పోటెత్తింది. రోడ్లనూ ముంచెత్తింది. వాహనాల రాకపోకలు గంటల కొద్దీ స్తంభించిపోయాయి. వచ్చే రెండు రోజుల్లో హైదరాబాద్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ కేంద్రం సూచించింది. హైదరాబాద్ సహా పలు జిల్లాకు హెచ్చరికలను జారీ చేసింది.

వర్షం పడిన ప్రతీసారీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వైఫల్యాలు ప్రస్తావనకు రావడం ఆనవాయితీగా మారింది. జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ దుస్థితి తలెత్తిందంటూ మీడియాలో కథనాలు వెలువడుతుంటాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని నాలాల గురించి పట్టించుకోకపోవడం వల్ల వరదనీరు లోతట్టు ప్రాంతాలను ముంచెత్తుతోందనే ఆరోపణలు వినిపిస్తుంటాయి.
ఈ పరిస్థితుల మధ్య కొత్తగా జీహెచ్ఎంసీ కమిషనర్గా బాధ్యతలను స్వీకరించిన సీనియర్ ఐఎఎస్ అధికారి రొనాల్డ్ రోస్.. క్షేత్రస్థాయిలో పర్యటనలకు శ్రీకారం చుట్టారు. హైదరాబాద్లో విస్తృతంగా పర్యటించారు. ఎక్కడెక్కడ వర్షపు నీరు నిల్వ ఉంటుందో ఆరా తీశారు. వర్షపు నీటిని తోడేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఈ తెల్లవారు జాము నుంచి కొన్ని గంటల పాటు రొనాల్డ్ రోస్.. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. జీన్స్ ప్యాంట్, టీ షర్ట్ - సాధారణ వ్యక్తిలా కలియతిరిగారు. ఆ సమయంలో ఆయన పారిశుద్ధ కార్మికులు వేసుకునే జాకెట్ను ధరించారు. చెత్త బండ్లల్లో పర్యటించారు. పారిశుద్ధ కార్మికుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలను పరిష్కరించడానికి హామీ ఇచ్చారు.
ఈ నెల 7వ తేదీన జీహెచ్ఎంసీ కమిషనర్గా రొనాల్డ్ రోస్ అపాయింట్ అయిన విషయం తెలిసిందే. ఇదివరకు జీహెచ్ఎంసీ కమిషనర్గా పని చేసిన సీనియర్ ఐఎఎస్ అధికారి డీఎస్ లోకేష్ కుమార్ను బదిలీ చేసింది. ఆయనను అదనపు ఎన్నికల ప్రధానాధికారిగా నియమించింది. అప్పటివరకు ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేసిన రొనాల్డ్ రోస్ను జీహెచ్ఎంసీ కమిషనర్గా నియమించింది.












Click it and Unblock the Notifications