కోడ్ అమల్లోకి: ఎన్నికల తర్వాతే 'మేయర్' తేలనుంది, రిజర్వేషన్లపై అసహనం
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నిక నగారా మోగింది. శుక్రవారం నాడే రిజర్వేషన్ల ఖరారు, ఎన్నికల షెడ్యూల్ ఖరారైంది. జిహెచ్ఎంసి ఎన్నికల షెడ్యూల్ విడుదలైనందున ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి వస్తుందని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ నాగిరెడ్డి శుక్రవారం నాడు వెల్లడించారు.
ఎన్నికల షెడ్యూల్ను విడుదల అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఫిబ్రవరి 2న ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తున్నామని, ఎక్కడైనా రీపోలింగ్ ఉంటే ఫిబ్రవరి 4న చేపడుతామన్నారు. ఈవీఎంల ద్వారానే జిహెచ్ఎంసి ఎన్నికలు నిర్వహిస్తామన్నారు.
జిహెచ్ఎంసి ఎన్నికల నిర్వహణ కోసం 12వేల ఈవీఎంలను వినియోగించనున్నట్టు చెప్పారు. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు. పోలింగ్ను 30మంది ఐఏఎస్ అధికారులు పర్యవేక్షిస్తారన్నారు.
మొత్తం 7,757 పోలింగ్ కేంద్రాలున్నాయన్నారు. .ప్రతీ పోలింగ్ కేంద్రంలో ఐదుగురు సిబ్బంది ఉంటారని చెప్పారు. జిహెచ్ఎంసి పరిధిలో మూడు వేలకు పైగా సమస్యాత్మక ప్రాంతాలున్నాయని చెప్పారు. మూడువేల కేంద్రాల్లో లైవ్ వెబ్ కాస్టింగ్ను నిర్వహిస్తామన్నారు.
ఎన్నికల ప్రక్రియ తర్వాతే మేయర్ పదవి రిజర్వేషన్పై ఖరారు
'మేయర్' రిజర్వేషన్ ఖరారు కాలేదు. ఎన్నికల ప్రక్రియ తర్వాతనే మేయర్ రిజర్వేషన్ ఖరారు కానుంది. గ్రేటర్ ఎన్నికల్లో తొలిసారి నోటాను చేర్చుతున్నారు.
రిజర్వేషన్లపై విపక్షాల అసంతృప్తి
రిజర్వేషన్ల పైన ప్రతిపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. పద్ధతి లేకుండా రిజర్వేషన్లు చేశారని, దీని పైన అభ్యంతరాలు తీసుకోలేదని, తాము సుప్రీం కోర్టుకు వెళ్తామని కాంగ్రెస్ నేత దానం నాగేందర్ చెప్పారు.
ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని, ప్రతిచోట అధికార టిఆర్ఎస్ పార్టీ ఉల్లంఘనలకు పాల్పడుతోందని టిడిపి తెలంగాణ అధినేత ఎల్ రమణ ఆరోపించారు. ప్రచారం చేసుకునేందుకు ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వడం లేదన్నారు. రిజర్వేషన్ల పైన అభ్యంతరాలు తీసుకోలేదన్నారు.
టిడిపితో సర్దుబాటు చేసుకొని ప్రకటిస్తాం: కిషన్ రెడ్డి
తెలుగుదేశం పార్టీతో సర్దుబాటు చేసుకొని అభ్యర్థులను ప్రకటిస్తామని బిజెపి తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు. గ్రేటర్లో బిజెపి - టిడిపి కూటమిదే విజయం అన్నారు. ఏ ప్రాతిపదికన గ్రేటర్ రిజర్వేషన్లు ఖరారు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కోర్టు 9వ తేదీ వరకు గడువు ఇచ్చినా ఫిబ్రవరి 2నే పోలింగ్ పెట్టడం దారుణమన్నారు.