సీమాంధ్రపై ప్రేమ వెనుక..: కెటిఆర్ సరదా వ్యాఖ్య, సీరియస్గా రేవంత్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం నాడు చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. తెలంగాణ రాష్ట్ర సమితిని తెలుగు రాష్ట్ర సమితిగా మారుస్తామని, తాను భీమవరంలో పోటీ చేస్తానని కెటిఆర్ గురువారం వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలు ఆయన సరదాగా చేశారని చెబుతున్నారు. అయితే, దీనికి తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి సహా విపక్షాల నుంచి గట్టి కౌంటర్ వచ్చింది. హైదరాబాదులోని సీమాంధ్రులను మెప్పించాలంటే.. తెలంగాణ భవన్ను మొదట తెలుగు భవన్గా మార్చాలని రేవంత్ రెడ్డి సవాల్ చేశారు.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల షెడ్యూల్ శుక్రవారం నాడు విడుదలైంది. షెడ్యూల్ విడుదలకు ముందు నుంచే జిహెచ్ఎంసి ఎన్నికల వేడి కనిపించింది. అన్ని పార్టీలు జోరుగా ప్రచారం నిర్వహించాయి. భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేశాయి. ఇప్పుడు షెడ్యూల్ విడుదల కావడంతో మరింత ఎన్నికల వేడి కనిపించనుంది.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సీమాంధ్రుల ఓట్లు కీలకం. వారు పెద్ద సంఖ్యలో ఉంటారు. ఈ కారణంగా వారిని బుట్టలో వేసుకునేందుకు తెరాస నేతలు, మంత్రులు ప్రయత్నాలు చేస్తున్నారు. వారు సీమాంధ్రులు, తెలంగాణ వారు సమానమని చెబుతున్నారు.
గత సార్వత్రిక ఎన్నికల్లో హైదరాబాదులో టిడిపి - బిజెపి కూటమి సత్తా చాటింది. ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలో గ్రేటర్లో మేయర్ పీఠం గెలుచుకొని పట్టు సాధించాలని టిఆర్ఎస్ భావిస్తోంది. ఇందులో భాగంగానే సీమాంధ్రులను తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
సీమాంధ్రులు, తెలంగాణవారు తమ ప్రభుత్వానికి సమానమేనని, తెలంగాణ వస్తే తాము ఇక్కడి నుంచి సీమాంధ్రులను తరిమేస్తామని చెప్పారని, కానీ అలాంటిదేమీ జరగడం లేదని చెబుతూ వారిని మచ్చిక చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
సినిమా పరిశ్రమలో సీమాంధ్రులు ఎక్కువగా ఉంటారు. ఈ నేపథ్యంలో వారికి తాయిలాలు ప్రకటించారు. సీమాంధ్రుల ఓట్ల కోసం టిఆర్ఎస్ తమ చేతిలో ఉన్న అన్ని అస్త్తాలను ప్రయోగిస్తోందని అంటున్నారు. అయితే, కాంగ్రెస్, టిడిపి నేతలు టిఆర్ఎస్ వైఖరి పైన మండిపడుతున్నారు.
ఉద్యమంలో సమయంలో సీమాంధ్రులను తిట్టరాని తిట్లు తిట్టి ఇప్పుడు వారి ఓట్ల కోసం కాళ్లబేరానికి వెళ్తున్నారని ఆరోపిస్తున్నారు. అప్పుడు వారి పైన తెరాస నేతలు తిట్టిన తిట్లు ఎవరూ మర్చిపోరని కాంగ్రెస్ నేత విహెచ్ అంటున్నారు. అప్పుడు తిట్టిన నోట ఇప్పుడు కపటపు ప్రేమ చూపిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
సీమాంధ్రులకు ఇచ్చే భరోసా పైన మంత్రులు, తెరాస నేతలు పోటీ పడుతున్నారని అంటున్నారు. అయితే, గురువారం నాడు మంత్రి కెటిఆర్ మరో ముందడుగు వేసి.. టిఆర్ఎస్ను తెలుగు రాష్ట్ర సమితిగా మారుస్తామని, నేను భీమవరం నుంచి పోటీ చేస్తానని సరదాగా వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. కెటిఆర్ సరదా కోసం అన్నప్పటికీ... ఆంధ్రుల మనసు గెలిచే ప్రయత్నంలో భాగంగానే ఆ వ్యాఖ్యలు చేశారని చాలామంది భావిస్తున్నారు. సీమాంధ్రులకు తెరాస వల్ల లాభం ఉండదని, తామే రక్ష అని కాంగ్రెస్, టిడిపి నేతలు చెబుతున్నారు.