గ్రేటర్ వార్: అక్బరుద్దీన్ వ్యాఖ్యలు ఎర్రగడ్డ స్థల ప్రభావం..స్పందించాల్సిన అవసరం లేదన్న విజయశాంతి
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో ఎంఐఎం పార్టీకి, బీజేపీకి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇక ఇదే సమయంలో అధికార పార్టీపై కూడా ఎంఐఎం పార్టీ ఘాటు వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. తాజాగా ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఆక్రమణల పేరుతో పివి ఘాట్, ఎన్టీఆర్ ఘాట్ లను కూల్చాలని డిమాండ్ చేయడం పెద్ద దుమారంగా మారింది. ఈ వ్యాఖ్యలపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఘాటుగా సమాధానం ఇవ్వగా ,విజయశాంతి సోషల్ మీడియా వేదికగా గట్టి కౌంటర్ ఇచ్చారు.

ఆ ఘాట్ లు కూల్చమని డిమాండ్ చేస్తే, తాజ్ మహల్ , చార్మినార్ కూల్చే డిమాండ్ రావచ్చు
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు స్థల ప్రభావం అంటూ విజయశాంతి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఫేస్ బుక్ వేదికగా స్పందించిన విజయశాంతి అక్బరుద్దీన్ ఓవైసీ జీ.. ఆక్రమణల పేరుతో పివి ఘాట్, ఎన్టీఆర్ ఘాట్ లు కూల్చమని డిమాండ్ చేస్తే, మరికొందరు ప్రజలు ఎఫ్ టి ఎల్ వాటర్ సమస్య ఉంది కాబట్టి తాజ్ మహల్ కూల్చమని , ట్రాఫిక్ కు అడ్డంగా ఉంది కాబట్టి చార్మినార్ కూల్చాలని కూడా అనవచ్చు అని పోస్ట్ చేశారు .

ఎర్రగడ్డ ప్రాంతంలో మాట్లాడినప్పుడు చేసిన వ్యాఖ్యలు స్థల ప్రభావం అనుకుంటా ..
ఈ విధమైన ప్రకటన అక్బరుద్దీన్ ఓవైసీ జీ ఎర్రగడ్డ ప్రాంతంలో మాట్లాడినప్పుడు చేసినందువల్ల స్థల ప్రభావంగా భావించి పెద్దగా స్పందించవలసిన అవసరం లేదని అభిప్రాయపడుతున్నాను అంటూ సెటైర్ వేశారు. అంతేకాదు సర్జికల్ స్ట్రైక్ వ్యాఖ్యలపై కూడా విజయశాంతి స్పందించారు. సర్జికల్ స్ట్రైక్ అన్న అంశానికి సంబంధించి హైదరాబాద్ పాతబస్తీలో రోహింగ్యాలు, పాకిస్తానీల గురించి టీఆర్ఎస్, ఎంఐఎం ఇంత ఆగమాగం ఎందుకు అవుతున్నాయి? అని ప్రశ్నించారు విజయశాంతి.

పాతబస్తీలో ఎవరినైనా దాచిపెట్టడం వల్లనే టీఆర్ఎస్ భయాందోళన అనుకునే ఛాన్స్
టీఆర్ఎస్ ప్రభుత్వం బ్రహ్మాండంగా ఇంటింటి సర్వే చేసిందని... పాతబస్తీలో ఆ విధంగా ఎవరూ లేరని... సీఎం గారు తెలంగాణ ప్రభుత్వం తరఫున కేంద్రానికి అధికారపూర్వక నివేదిక ఇవ్వచ్చు కదా? అంటూ ప్రశ్నించారు. లేకుంటే ఎవరినైనా దాచిపెట్టడం వల్లనే టీఆర్ఎస్ భయాందోళనలకు గురవుతున్నదని ప్రజలు అభిప్రాయపడే అవకాశముందన్న విజయశాంతి టిఆర్ఎస్ పార్టీని, ఎంఐఎం పార్టీ ని టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేశారు. ఒకరకంగా గ్రేటర్ వార్ లో విజయశాంతి అటు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను , మంత్రి కేటీఆర్ ను , ఎంఐఎం నాయకులను మాత్రమే లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తున్నారు .












Click it and Unblock the Notifications