టీఆర్ఎస్లో చేరిన కౌశిక్ రెడ్డికి గట్టి షాక్... రూ.5.6లక్షలు జరిమానా విధించిన జీహెచ్ఎంసీ...
టీఆర్ఎస్లో చేరిన పాడి కౌశిక్ రెడ్డికి జీహెచ్ఎంసీ అధికారులు షాకిచ్చారు. టీఆర్ఎస్లో చేరిక వేళ హైదరాబాద్లో అనుమతి లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారన్న కారణంతో భారీ జరిమానా విధించారు. రూ.5.6 లక్షలు కౌశిక్ రెడ్డికి జరిమానా విధించినట్లు తెలుస్తోంది. బుధవారం(జులై 21) సాయంత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే.
కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్లో చేరిక సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ... కౌశిక్ రెడ్డి తండ్రి సాయినాథ్రెడ్డి తనకు చిరకాల మిత్రుడు అని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో సాయినాథ్రెడ్డి తనతో కలిసి పని చేశారని గుర్తుచేశారు. రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కౌశిక్రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరారని పేర్కొన్నారు.' ప్రొఫెసర్ జయశంకర్ గారి సలహాలతో ఉద్యమాన్ని నడిపాం. ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఉద్యమం కొనసాగించాం. ప్రజాస్వామ్యంలో పార్టీలు ఓడడం.. గెలవడం నిరంతర ప్రక్రియ. శాశ్వతంగా ఎవరూ అధికారంలో ఉండరు.. ఇది రాచరిక వ్యవస్థ కాదు...' అని పేర్కొన్నారు.

'ఎన్నికలతో సంబంధం లేకుండా అభివృద్ధి చేస్తూ ముందుకు వెళ్తున్నాం.. అన్ని ఎన్నికల్లో ప్రజలు మమ్మల్ని గెలిపిస్తున్నారు. దేశంలో దళితులు అణచివేతకు గురయ్యారు. అందుకే దళితుల అభివృద్ధి కోసం తెచ్చిన దళిత బంధు పథకం తీసుకొస్తున్నాం. దీన్ని చూసి కొంత మందికి బీపీ పెరుగుతోంది. మాకు కులం మతం జాతి లేదు.. పేదరిక నిర్ములన దిశగా సాగుతున్నాం. రైతు బంధు వల్ల రైతు ఇప్పుడు ధీమాతో ఉన్నాడు. తెలంగాణ ఇక ఎవడు ఏం చేసినా కరెంట్ పోదు..' అని చెప్పుకొచ్చారు.
అంతకుముందు,కొండాపూర్లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ... హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కోసమే టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన అవకాశాన్ని ఈటల రాజేందర్ దుర్వినియోగం చేశారని ఆరోపించారు. హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి ఈటల చేసిందేమీ లేదన్నారు. తన సొంత అభివృద్ధి కోసం నియోజకవర్గ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు.
Recommended Video

హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు, తన మద్దతుదారుల కోరిక మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారని... ఆయన చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలకు ఆకర్షితుడిని అయ్యానని చెప్పారు.కాళేశ్వరం, లోయర్ మానేరు ప్రాజెక్టు,రైతు బంధు,రైతు భీమా పథకాలతో రైతులంతా సంతోషంగా ఉన్నారని తెలిపారు. తెలంగాణ దళిత బంధు పథకం అమలుకు హుజురాబాద్ నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయడం గొప్ప విషయమన్నారు.












Click it and Unblock the Notifications