హైదరాబాద్లో ఉచితంగా 200 వైఫై కేంద్రాలు, జిమ్
హైదరాబాద్: రానున్న రోజుల్లో హైదరాబాద్ సిటీ వైఫై సిటీగా మారనుంది. ఇందుకు సంబంధించి జీహెచ్ఎంసీ సన్నాహాలు ప్రారంభించింది. 200కు పైగా కేంద్రాల్లో ఈ వైఫై సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
వైఫై సౌకర్యం కల్పించాలని నగరంలోని యువత నుంచి ఈమెయిళ్లు రావడంతో ఆ దిశగా పనులను ప్రారంభించినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్, ఇతర అధికారులు దీనిపై దృష్టి పెట్టారు.
నగరంలోని రద్దీగా ఉండే ప్రాంతాలను గుర్తించి సుమారు మూడు గంటలపాటు వైపై సేవలు అందించాలని ఆలోచిస్తున్నారు. ఇందుకు గాను రూ. 10 కోట్లు కేటాయించారు. జీహెచ్ఎంసీ ప్రకటించే మెయిల్ లేదా ఫోన్ నెంబర్ ద్వారా సంప్రదించినవారికి పాస్ వర్డ్ తెలియజేస్తారు.
వైపై సెంటర్ల వద్ద ఆ పాస్ వర్డ్ను ఉపయోగించడం ద్వారా వినియోగదారులు తన స్మార్ట్ ఫోన్లలో ఇంటర్నెట్ను ఉపయోగించుకోవచ్చు. దీనిపై త్వరలోనే పూర్తి సమాచారం అందిస్తామని అధికారులు తెలిపారు.
వైపై సేవలను అందించేందుకు ఇందిరా పార్కు, కేబీఆర్ పార్కు, సంజీవయ్య పార్కు లాంటి వాటితో పాటు నగరంలో రద్దీగా ఉండే ప్రాంతాలను కూడా ఎంపిక చేస్తున్నారు. దీంతో పాటు యువత కోసం నగరంలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఓ జిమ్ను కూడా నెలకొల్పాలని నిర్ణయించింది.