యువతిపై రేప్, హత్య: గోదావరిలో గల్లంతు, శవాలు లభ్యం
హైదరాబాద్: సికింద్రాబాదులోని లాలాగూడ పోలీసుస్టేషను పరిధిలోని శాంతినగర్లో 17 ఏళ్ల యువతిపై గుర్తుతెలియని వ్యక్తులు అత్యాచారం చేసి దారుణంగా హతమార్చారు. పోలీసులు వచ్చి యువతి మృతదేహాన్ని గాంధీ మార్చూరీకి తరలించారు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలావుంటే, పుష్కర స్నానానికి గోదావరి నదిలోకి దిగి గల్లంతైన ఇద్దరు మహిళల మృతదేహాలు దొరికాయి. వరంగల్ జిల్లా ఏటూరు నాగారం మండలం కంతానపల్లి పడవరేవు వద్ద మహిళల శవాలను సోమవారం ఉదయం గుర్తించారు. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన పార్వతి (35), కల్పన (21) కంతానపల్లి ప్రాజెక్టు నిర్మాణంలో కూలీలుగా పనిచేస్తున్నారు.
ఈ నెల 25వ తేదీ సాయంత్రం గోదావరిలో స్నానం చేసేందుకు దిగి, ప్రవాహ ఉధృతికి కొట్టుకుపోయారు. వారి కోసం పోలీసులు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను ఏటూరునాగారం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
చేతబడి పేరుతో హత్య
చేతబడి పేరుతో నల్లగొండ జిల్లాలోని మఠంపల్లి మండలంలోని వర్దాపురం గ్రామపంచాయతీ పరిధిలోని రాజీవ్ నగర్ కాలనీలో మల్లారపు దానయ్య (50) అనే వ్యక్తిని శనివారం రాత్రి హత్య చేశారు. మృతుడు దానయ్య భార్య రూతమ్మ, కుమారుడు వీరబాబు వర్దాపురంలోని బంధువుల ఇంటికి వెళ్లారు. రాత్రి దానయ్య ఒక్కడే నిద్రపోయాడు. ఆదివారం తెల్లవారు జామున అతను ప్రాణఆలో కోల్పోయి కనిపించాడు. తలపై గొడ్డలితో నరికిన గాయాలున్నాయి.