కారుపై పడిన కారు: చిన్నారి రమ్య బ్రెయిన్ డెడ్, అవయవదానం
హైదరాబాద్: నాగార్జున సర్కిల్ వద్ద కారు పైన కారు పడిన ప్రమాదంలో తొమ్మిదేళ్ల చిన్నారి రమ్య జీవన్మృతి పొందింది. ఆమె బ్రెయిన్ డెడ్ కావడంతో కుటుంబ సభ్యులు రమ్య అవయవాలు దానం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
రమ్య సెయింట్ ఆన్స్ హైస్కూల్లో మూడో తరగతి చదువుతోంది. కారు ప్రమాదంలో రమ్య బాబాయి రాజేష్ మృతి చెందగా, రమ్య సహా కుటుంబ సభ్యులకు తీవ్ర గాయాలయ్యాయి. రమ్య బ్రెయిన్ డెడ్ అయింది. ఆమె గుండె, కాలేయం, కిడ్నీలను డొనేడ్ చేస్తున్నారు.
కాగా, వరంగల్ జిల్లా హన్మకొండకు చెందిన విశ్రాంత ఇంజినీర్ మధుసూదన చారికి వెంకటరమణ, రమేష్, రాజేష్ అనే ముగ్గురు కుమారులు. పెద్ద కుమారుడు వెంకటరమణ సాఫ్టువేర్ సంస్థలో పని చేస్తున్నాడు. శుక్రవారం ప్రమాదంలో వెంకటరమణ భార్య రాధిక తీవ్రంగా గాయపడగా, వీరి కుమార్తె రమ్య(9) బ్రెయిన్ డెడ్ అయింది.
ఇదే ప్రమాదంలో మధుసూదనచారి రెండో కుమారుడు రమేష్ తీవ్రంగా గాయపడగా, మూడో కుమారుడు రాజేష్(37) అక్కడికక్కడే మృతి చెందాడు.
చిత్తుగా తాగి బిటెక్ విద్యార్థుల డ్రైవింగ్: కారుపై పడిన మరో కారు, టెక్కీ మృతి
రమ్యను శుక్రవారమే సికింద్రాబాద్లో సెయింట్ ఆన్స్ పాఠశాలలో చేర్పించారు. తాము ఉండే హైటెక్ సిటీ ప్రాంతం రమ్య పాఠశాలకు దూరమవుతుందని మారేడ్పల్లిలో ఒక ఇల్లు చూసుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం చిన్నారిని తీసుకొచ్చేందుకు వెంకటరమణ సతీమణి రాధిక, అతని సోదరులు రమేష్, రాజేష్, తండ్రి మధుసూదనచారి కారులో వెళ్లారు.
వెస్ట్ మారేడ్పల్లిలో తీసుకున్న ఇంటిని చూసి రమ్యను పాఠశాల నుంచి తీసుకురావొచ్చని వెళ్లారు. ఆపై సికింద్రాబాద్ నుంచి బంజారాహిల్స్ వైపు వస్తున్నారు. కారులో రమ్య తల్లి రాధిక, తాత మధుసూదనా చారి, బాబాయిలు రమేష్, రాజేష్ ఉన్నారు. రాజేష్ కారును నడుపుతున్నారు.
ఈ క్రమంలోనే ప్రమాదం చోటుచేసుకుంది. సరిగ్గా పంజాగుట్ట ఫైఓవర్ మీది నుంచి బంజారాహిల్స్ వైపు కారు దిగుతోంది. కాగా ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న శ్రావిల్ (20)తోపాటు అతని స్నేహితులతో కారులో బంజారాహిల్స్ నుంచి హిమాయత్నగర్ వైపు కారులో వెళ్తున్నారు.
శ్రావిల్ కారు నడుపుతుండగా చట్నీస్ సమీపంలోకి చేరుకోగానే కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొని గాలిలోకి ఎగిరి ఎదురుగా వస్తున్న రాజేష్ కుటుంబ సభ్యుల కారుపై పడింది. శ్రావిల్, అతని స్నేహితులు తాగి ఉన్నట్లుగా చెబుతున్నారు. నిందితులపై 304ఎ పార్ట్ 2 కింద కేసు నమోదు చేసి, నిందితున్ని రిమాండ్ తరలించారు.
ఇదిలా ఉండగా, శనివారం సాయంత్రం వరకు బంజారాహిల్స్లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి రమ్య బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. రమ్య బాబాయి రాజేష్కు మూడేళ్ల క్రితం పైళ్లైంది. అతనికి రెండేళ్ల కొడుకు ఉన్నారు. ఇటీవలే ఉద్యోగానికి రాజీనామా చేసి అమెరికా వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఆదివారం వెళ్లాల్సి ఉంది. అనుకోని ప్రమాదంలో మృతి చెందారు.