వరదలో పుస్తకాలు పోయాయి: అందర్నీ కదిలించిన బాలిక, వారి కోసం భాష నెర్చుకున్న కలెక్టర్
అదిలాబాద్: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చాలా ఇళ్లు నీట మునిగాయి. అదిలాబాద్ జిల్లా దుబర్పేట గ్రామంలో ఓ బాలిక కలెక్టర్ దివ్య దేవరాజన్ వద్ద తన గోడు వెళ్లబోసుకుంది. ఇది కలెక్టర్ సహా అక్కడున్న వారిని భావోద్వేగానికి గురి చేసింది.
ఆ బాలిక పేరు జ్యోతిక. గోండు సామాజిక వర్గం. కలెక్టర్ వరద పరిస్థితిపై వివరాలు తెలుసుకునేందుకు పునరావాస కేంద్రానికి రాగా.. ఆ బాలిక తన గోండు భాషలో తన క్లాస్ రూం పుస్తకాలు, పెన్నులు, పెన్సీళ్లు, యూనిఫాం.. అన్నీ వరదలో కొట్టుకుపోయాయని కంటతడి పెట్టుకుంది.
వరద బాధిత ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఆదివారం కలెక్టర్ దివ్య దేవరాజన్ అక్కడకు వచ్చారు. ప్రజలను పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఆ సమయంలో ఆ బాలిక తన ఆవేదనను వెళ్లగక్కారు. తన పుస్తకాలు వరదలో కొట్టుకు పోయాయని చెబుతుండటం అందరినీ కదిలించింది.
ఆ బాలిక గోండు భాషలో చెప్పిన ఆవేదనను కలెక్టర్ దివ్య దేవరాజన్ అర్థం చేసుకున్నారు. బాధపడవద్దని, మీకు కావాల్సిన వాటిని అన్నింటిని సమకూరుస్తామని ఆ బాలికకు గోండు భాషలోనే చెప్పారు.
అక్కడి ఆదివాసీలు గోండు భాషలో మాట్లాడుతారు. ఎక్కువ మంది ఆదివాసీలు ఉన్న ఆ ప్రాంతంలో వారితో మాట్లాడేందుకు అనుకూలంగా ఉంటేందుకు కలెక్టర్ దివ్య దేవరాజన్ కూడా గోండు భాష నేర్చుకున్నారు. ఆ భాషలోనే వారితో ఆమె మాట్లాడుతారు.