తెరపైకి జూ.ఎన్టీఆర్, తెలంగాణలో టీడీపీ ఉంటుంది: బాబు కీలక వ్యాఖ్యలు, కేసీఆర్తో పొత్తుపై..
హైదరాబాద్: టీడీపీ అధ్యక్షులు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు బుధవారం హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో తెలంగాణ టీడీపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణలో పార్టీ బలోపేతంపై చర్చించారు.
Recommended Video
వైయస్కు అందుకే కక్ష, చిన్న మిస్టేక్: విభజన-కేసీఆర్పై బాబు, బాహుబలి సినిమాపై..
కార్యకర్తలతో భేటీలో జూనియర్ ఎన్టీఆర్కు సారథ్య బాధ్యతలు, తెరాసతో పొత్తు, ఆ పార్టీలో విలీనం, సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు, పార్టీ వీడుతున్న నేతలు తదితర అంశాలపై చర్చకు వచ్చాయి. ఈ సందర్భంగా కూడా బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ ఏకపక్షంగా పొత్తు తెంచేసుకుందన్నారు.
నేను చిన్నప్పటి నుంచి చూశా
భేటీలో చంద్రబాబు మాట్లాడారు. ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా సాధ్యమే అన్నారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు కొన్ని సమస్యలు రావడం సహజమే అన్నారు. తాను చిన్నప్పటి నుంచి చూశానని, కాలేజీ రోజుల్లోనే సామాజిక న్యాయం కోసం పని చేశానని చెప్పారు. పోరాటాలు చేసినప్పుడే అవకాశాలు వస్తాయని, చిత్తశుద్ధి ఉంటే క్రమశిక్షణతో ముందుకు వెళ్లినప్పుడే జయించే శక్తి వస్తుందన్నారు.
తెలుగు జాతి కోసమే పార్టీ పెట్టారు
తెలంగాణలో ఒక్క టిడిపికే బలమైన కేడర్, నాయకత్వం ఉందని చంద్రబాబు చెప్పారు. రెండు రాష్ట్రాల్లో టీడీపీ ఉంటుందన్నారు. తెలుగు జాతి కోసమే ఎన్టీఆర్ టీడీపీ పెట్టారని చెప్పారు. సమన్యాయం కోసం ఆనాడు పోరాడానని చెప్పారు. రెండు ప్రాంతాలకు న్యాయం చేయమని చెప్పానని తెలిపారు.
విభజన జరిగింది, నాపై ఏపీ బాధ్యత
విభజన జరిగిందని, ఒకప్పుడు తాను హైదరాబాదును అభివృద్ధి చేశానని, తనపై ఓ బాధ్యత ఉందని, విభజన వల్ల నష్టపోయిన ఏపీని బాగు చేయాల్సి ఉందని చంద్రబాబు చెప్పారు. పాత రోజులు గుర్తుకు వస్తే తెలంగాణలో మళ్లీ పార్టీకి భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. కొత్త రాష్ట్రం, చాలా సమస్యలు, ఉండేందుకు ఆఫీసు కూడా లేని సమస్య అన్నారు. అక్కడి నుంచి పరిపాలన ప్రారంభించాని, ఒక్కో అడుగు ముందుకేసి నిలదొక్కుకునే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.
రాజకీయాల్లో నమ్మకంగా
కొంతమంది పార్టీ వీడినా కొంతమంది నమ్మకంగా ఉన్నారని చంద్రబాబు చెప్పారు. తీవ్రవాదుల దాడుల్లో చనిపోయిన కుటుంబాలు పార్టీని వీడలేదన్నారు. రాజకీయాలు ఎప్పుడు ప్రజల మనోభావాలకు దగ్గరగా ఉండాలన్నారు. క్రమశిక్షణతో పని చేస్తే అందరికీ గుర్తింపు వస్తుందన్నారు. పార్టీ కోసం టీడీపీ నేతలు ఎంతో త్యాగం చేశారన్నారు. ఆస్తులు అమ్ముకొని జెండాలు మోసిన కార్యకర్తలు ఉన్నారని చెప్పారు.
పొత్తు, టీఆర్ఎస్లో విలీనంపై ఆసక్తికరం
టీఆర్ఎస్లో విలీనం చేస్తే ఆత్మహత్య చేసుకుంటామని కొందరు కార్యకర్తలు చంద్రబాబుతో అన్నారు. అప్పుడు బాబు మాట్లాడుతూ.. విలీనం చేసే హక్కు ఎవరికీ లేదన్నారు. తెలంగాణలో టీడీపీ ఉంటుందన్నారు. కార్యకర్తల మనోభావాల మేరకు పొత్తు అన్నారు. అందరితో మాట్లాడి పార్టీని కాపాడుకునేందుకు కృషి చేస్తానని చెప్పారు.
మోత్కుపల్లిని సస్పెండ్ చేయాలని, పొత్తు వద్దని నినాదాలు
పార్టీ నుంచి మోత్కుపల్లి నర్సింహులును సస్పెండ్ చేయాలని కొందరు డిమాండ్ చేశారు. ఆయన తెరాసకు అనుకూలంగా మాట్లాడుతున్నారన్నారు. అదే సమయంలో తెరాసతో పొత్తు వద్దు అని పలువురు నినదించారు.
జూనియర్ ఎన్టీఆర్ను అధ్యక్షుడిగా
చంద్రబాబుతో భేటీ సందర్భంగా కొందరు.. తెలంగాణ బాధ్యతలు జూనియర్ ఎన్టీఆర్కు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఆయనను రంగంలోకి దించాలని కోరారు. అన్ని విషయాలను కార్యకర్తలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామన్నారు. అయితే, తెలంగాణ బాధ్యతలను చంద్రబాబు ఇవ్వరు.. ఆయన తీసుకోరనే వాదనలు వినిపిస్తున్నాయి.