జాతీయ ప్రాధాన్య కట్టడంగా తెలంగాణలోని 'గొల్లల గుడి'.. ఈ ఆలయం ఎక్కడ ఉందో తెలుసా..?
తెలంగాణలో అనేక చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి. తెలంగాణను శాతవాహనుల నుంచి నిజాం రాజుల వరకు అనేక మంది పరిపాలిస్తూ వచ్చారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రాంతంలో కాకతీయులు, కుతుబ్ షాహీలు, నిజాం ప్రభువులు అనేక కట్టడాలను నిర్మిస్తూ వచ్చారు. అవి ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నాయి. తాజాగా ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలో ఉన్న 'గొల్లల గుడి' కి జాతీయ ప్రాధాన్య కట్టడంగా గుర్తింపు దక్కింది. ఈ మేరకు భారత పురావస్తు అధ్యయన విభాగం (ASI) అధికారిక పత్రికా ప్రకటనను విడుదల చేసింది. ఇక ఇప్పటికే ములుగు జిల్లా పాలంపేట గ్రామంలోని రామప్ప దేవాలయం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
ఇక గొల్లల గుడి విశేషాలు చూస్తే.. ములుగు జిల్లా పాలంపేట గ్రామంలోని రామప్ప ఆలయానికి నైరుతి దిశలో ఈ గొల్లల గుడి నెలకొని ఉంటుంది. ఇది తూర్పు ముఖంగా గల మండపం, దాని చుట్టూ మూడు గర్భాలయాలతో కూడిన త్రికూటాలయంగా కనిపిస్తుంది. అలాగే గుడి ప్రహరీ శిల్పాలంకృతమై, పైకప్పు అంచు నిర్మాణం, ద్వారబంధాల వద్ద చెక్కిన హంసల వరుసతో, సునిశిత రంధ్రాల వల పనితనంతో ఈ ఆలయం ఎంతో విశిష్టమైనదిగా అలరారుతోంది. ఈ ప్రధాన గుడికి ముందు వైపున రెండు ప్రత్యేక ఉప ఆలయాలు ఎంతో అందంగా చెక్కిన ద్వారపాలకుల విగ్రహాలతో అలంకృతమై ఉంటాయి. వీటికి ముందు గల అంతరాలయాల అంచులు కూడా చక్కని తెరలతో శోభాయమానంగా కనిపిస్తాయి.

అలాగే ప్రధాన ఆలయ నిర్మాణం ముందు భాగాన మండపం గుండా మధ్యలో గల ప్రధాన మందిరానికి మార్గం ఉంటుంది. దీనికి ఉత్తర, దక్షిణ, పశ్చిమ దిశలలో అంతరాలయాలతో మూడు గర్భాలయాలు కూడా ఉంటాయి. ఆలయ గోడలపై కనిపించే వివిధ గూళ్లలో విష్ణుమూర్తి, లక్ష్మి, గణేశుడు, మహిషాసురమర్దిని విగ్రహాలు దర్శనమిస్తాయి. జంతువుల ఆకారాలు, పుష్పాలంకరణతో కూడిన ఎత్తయిన వేదికపై ఈ ఆలయం నిర్మితమైంది.












Click it and Unblock the Notifications