ఆ రైతులకు శుభవార్త..నెలాఖరు వరకే ఛాన్స్.. మిస్ చేసుకోవద్దు!
పత్తి రైతులకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది. పత్తి కొనుగోళ్ళ గడువును ఫిబ్రవరి నెలాఖరు వరకు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. ఈనెల 22వ తారీఖున పత్తి కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్టు ప్రకటించిన కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతుల ప్రస్తుత అవసరాలను దృష్టిలో ఉంచుకొని గడువును పొడిగిస్తున్నట్లు పేర్కొంది.
తెలంగాణా మంత్రి విజ్ఞప్తి.. స్పందించిన సీసీఐ
తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పత్తి రైతులు ఇంకా పత్తిని పూర్తిస్థాయిలో అమ్ముకోలేదని దీనిని దృష్టిలో పెట్టుకొని రైతుల సౌకర్యార్థం గడువు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి మేరకు స్పందించిన cci ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. ఆయన ఆదేశాలతో వ్యవసాయ శాఖ జాయింట్ సెక్రెటరీ కేంద్ర జౌళి శాఖకు లేఖ పంపారు.

రైతులకు తుమ్మల సూచన
ఈ నిర్ణయం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేస్తూ రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అంతకుముందు పత్తి కొనుగోళ్లు గడువు పెంచాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కోరారు.అయితే ఈ సీజన్ లో ఆరంభం నుండే సీసీఐ తేమ పేరుతో పత్తి కొనుగోళ్లలో కోతలు విధించి రైతులను ఇబ్బందులకు గురిచేసిందని ఆరోపణలు ఉన్నాయి.
ఈసారి పత్తి రైతుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు
అలాగే కపాస్ కిసాన్ యాప్ ద్వారా రైతులు అమ్మకాలకు బుక్ చేసుకునే క్రమంలో కూడా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఇక మరోవైపు క్వింటాలుకు 8,110 రూపాయలు మద్దతు ధర ఉన్నప్పటికీ చాలా మంది రైతులకు సరైన ధర కూడా దక్కలేదు. దీంతో పత్తి రైతులు తక్కువ ధరలకు ప్రైవేటు వ్యాపారులకు పత్తిని అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక అకాల వర్షాలు, వరదల కారణంగా పత్తి దిగుబడి కూడా తగ్గింది.
రైతులకు సీసీఐ నిర్ణయంతో సంతోషం
పంట ఆలస్యంగా రైతుల చేతికి వచ్చింది. అనేక సమస్యలతో పత్తి రైతులు ఇబ్బంది పడిన వేళ సీసీఐ కొనుగోలు కొంత ఆలస్యంగా మొదలయ్యాయి. సాధారణంగా పత్తిని మార్చి నెల వరకు కూడా సీసీఐ కొనుగోలు చేస్తుంది. కానీ ఈసారి ముందే కేంద్రాలను మూసివేయాలని నిర్ణయించడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం సీసీఐ తాజా నిర్ణయం రాష్ట్రంలోని పత్తి రైతులలో సంతోషాన్ని నింపుతుంది.












Click it and Unblock the Notifications