విద్యార్థులకు శుభవార్త.. పీహెచ్డీ స్కాలర్స్ కు 15వేలు, పీజీ వాళ్ళకు 12వేలు.. స్టైఫండ్ పెంపు!
తెలంగాణ రాష్ట్రంలోని వ్యవసాయ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని 11 అనుబంధ కళాశాలల్లో పీజీ మరియు పీహెచ్డీ స్కాలర్ లకు తీపి కబురు అందింది. ఆచార్య జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వీసీ జానయ్య స్టైఫండ్ పెంపు పైన విద్యార్థులకు హామీ ఇవ్వడంతో విద్యార్థులలో సంతోషం వ్యక్తమైంది.
స్టైఫండ్ పెంపు కోసం విద్యార్థుల దీక్ష
అగ్రికల్చర్ యూనివర్సిటీ విద్యార్థులు స్టైఫండ్ పెంపు కోసం గురు, శుక్రవారాలు దీక్ష చేపట్టారు. బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వీరి దీక్షకు సంఘీభావం తెలిపారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ఫోన్లో మాట్లాడి మద్దతు ప్రకటించారు. స్టైఫండ్ పెంచాలని విద్యార్థులు ఎంత ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేదు.

సొంత వనరులతోనే స్టయిఫండ్ పెంపుకు పాలకమండలి తీర్మానం
దీంతో విద్యార్థులు తీవ్రమైన నిరసన వ్యక్తం చేయడంతో పాటు, యూనివర్సిటీ భవనం పైకి ఎక్కి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. ఇక ఈ సంక్షోభం నేపథ్యంలో విద్యార్థులతో మాట్లాడిన వీసీ జానయ్య, సచివాలయానికి వెళ్లి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లను కలిశారు. సొంత వనరులతోనే స్టయిఫండ్ పెంపుకు పాలకమండలి తీర్మానాన్ని ఆమోదించాలని కోరారు.
విద్యార్థులకు శుభవార్త చెప్పిన వీసీ
దీనికి మంత్రులు సుముఖత వ్యక్తం చేశారు. మంత్రుల ఆమోదంతో విశ్వవిద్యాలయానికి తిరిగివచ్చిన వీసీ విద్యార్థులకు ఆ విషయాన్ని తెలియజేశారు. ఈ నిర్ణయంతో 11 కళాశాలలో చదువుతున్న వందలాది మంది పీజీ మరియు పీహెచ్డీ విద్యార్థులకు ఊరట లభించింది. అప్పటివరకు నిరవధిక దీక్షకు దిగిన విద్యార్థులు వీసీ ప్రకటన తర్వాత దీక్షను విరమించారు. విద్యార్థులకు పెరిగిన స్టైఫండ్ ఈనెల 16వ తేదీన విద్యార్థుల ఖాతాలలో జమ చేస్తామని వీసీ తెలిపారు.
వారికి స్టైఫండ్ ఎంత పెరిగిందంటే
ప్రస్తుతం విద్యార్థులకు స్టైఫండ్ పెంపుదల తర్వాత పీజీ విద్యార్థుల స్టయిఫండ్ 5000 నుంచి 12 వేల రూపాయలకు పీహెచ్డీ స్కాలర్ లకు ఏడువేల రూపాయల నుంచి 15 వేల రూపాయలకు పెరుగుతుంది. అయితే ఈ కొత్త స్టైఫండ్ 2025 ఆగస్టు నుంచి వర్తింపజేస్తామని వీసీ జానయ్య స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications