సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కు వెళ్లేవారికి గుడ్ న్యూస్
పరీక్షలు ముగిశాయి. విద్యార్థులకు వేసవి సెలవులు ఇచ్చేశారు. దీంతో చాలామంది పట్టణాలను వదిలిపెట్టి పల్లెలలకు ప్రయాణమవుతున్నారు. ప్రధానంగా హైదరాబాద్ లో ఉన్నవారు స్వగ్రామాలకు తిరుగుపయనమయ్యారు. దీంతో రైళ్లల్లో విపరీతమైన రద్దీ పెరిగింది. వేసవి కూడా కావడంతో మరికొందరు టూర్లకు ప్రణాళికలు రచిస్తున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతుండటంతో అన్ని రైళ్లల్లో విపరీతమైన రద్దీ నెలకొంది.
రద్దీకి తగినట్లుగా అధికారులు కూడాప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుంచి వివిధ రాష్ట్రాలకు ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి. టికెట్లు తీసుకునే సమయంలో ప్రయాణికులు క్యూలో నిలుచోవాల్సి వస్తోంది. రద్దీవల్ల రైలు కూడా అందుకోలేకపోతున్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి సాధారణంగా 1.80 లక్షల మంది ప్రతిరోజు రాకపోకలు సాగిస్తుంటారు. సెలవులు కావడంతో ఆ సంఖ్య 2.20 లక్షలకు పెరిగింది. యూటీఎస్ యాప్, క్యూఆర్ కోడ్ తో టికెట్లు తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ ప్రయాణికులు మాత్రం బారులు తీరుతున్నారు.

దీంతో దక్షిణ మధ్య రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. స్టేషన్ లో అదనంగా మరో 5 టికెట్ బుకింగ్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. వీటిల్లో కూడా ప్రయాణికులు టికెట్లు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. భారీగా బారులు తీరి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని, వెంటనే ఈ కౌంటర్ల నుంచి టికెట్ పొందాలని చెబుతున్నారు. ప్రయాణికుల రద్దీ ఇంకా ఎక్కువగా ఉంటే మరిన్ని రైళ్లను కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి రద్దీ బాగా ఎక్కువగా ఉండటంతో అధికారులు కూడా కొన్ని రైళ్లను త్వరలోనే చర్లపల్లి రైల్వేస్టేషన్ నుంచి నడపబోతున్నారు. సికింద్రాబాద్ వచ్చే పనిలేకుండా చర్లపల్లి నుంచి మౌలాలి, సనత్ నగర్ మీదగా లింగంపల్లికి చేరుకోవచ్చు.












Click it and Unblock the Notifications