రైతులకు శుభవార్త.. ఖరీఫ్ సీజన్ రైతు భరోసాకు ముహూర్తం ఖరారు!
తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పటానికి ముహూర్తం ఫిక్స్ చేసింది . ఖరీఫ్ సీజన్ పంటల సాగుకు సన్నాహాలు ముమ్మరం చేస్తోంది. రైతుల పంట పెట్టుబడులకు ఆర్థిక సహాయం అందించే రైతు భరోసా కార్యక్రమం కింద ఎకరానికి రూ.6,000 చొప్పున సాయం అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు అర్హులైన రైతుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా నిధులు జమ చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రతి ఎకరానికీ సాయం అందించేలా నిర్ణయం
ఈ నెలాఖరు నాటికి సాయం విడుదల చెయ్యాలని సర్కార్ భావిస్తోంది. గత యాసంగి సీజన్లో కేవలం రెండు ఎకరాల వరకే సహాయం పరిమితం చేయడంపై రైతులు, ప్రజా ప్రతినిధుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈసారి సాగు చేసే ప్రతి ఎకరానికీ సాయం అందించేలా నిర్ణయం తీసుకుంది. ఇది చిన్న, సన్నకారు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

ఖమ్మం జిల్లా నుండే రైతు భరోసా ప్రారంభం
ఖమ్మం జిల్లాలోని ఒక కేంద్రం నుంచి ఈ పథకం అధికారికంగా ప్రారంభించనున్నారు. కొత్తగా డిజిటల్ పట్టాలు పొందిన రైతులకు కూడా త్వరగా నిధులు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం ఆర్థిక భారాన్ని సమర్థవంతంగా నిర్వహించాలనే ఉద్దేశ్యంతో కొన్ని కటాఫ్ పరిమితులు విధించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఐదు నుంచి ఏడున్నర ఎకరాల వరకు మాత్రమే గరిష్ట పరిమితి నిర్ణయించే అవకాశం ఉంది.
లబ్ధిదారుల జాబితా నుంచి ఆ భూములున్న వారిని తొలగింపు
రాష్ట్రంలో మొత్తం సాగుభూమి సుమారు 1.40 కోట్ల ఎకరాలు ఉన్నట్లు అంచనా. అయితే రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు, బీడు భూములు, రోడ్లు, కాలువల కిందకు వెళ్లిన సుమారు 5.50 లక్షల ఎకరాలను శాటిలైట్ సర్వే ద్వారా గుర్తించి లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించనున్నారు. దీంతో సుమారు రూ.1,200 కోట్లు ప్రజాధనం ఆదా అవుతుందని ఆర్థిక శాఖ అంచనా వేసింది.
దీనికోసం వ్యవసాయ శాఖ మరియు ఆర్థిక శాఖలు సమన్వయంతో పని చేస్తున్నాయి.
రైతు సంక్షేమం పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధత ఇది
నిధుల విడుదలకు ఆర్థిక శాఖ ఆమోదం వచ్చిన వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తారు. ఖరీఫ్ సీజన్లో పంటల సాగు విస్తీర్ణం పెరిగే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని ఈ సహాయం రైతులు అప్పుల భారం లేకుండా పంటలు పండించటానికి ఉపయోగపడుతుంది. రైతు సంక్షేమం పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను ఈ నిర్ణయం ద్వారా స్పష్టం అవుతుంది.
రైతుల ఆదాయం పెంచటంలో కీలక పాత్ర
రైతులు కూడా సరైన పత్తి, మొక్కజొన్న, పప్పుధాన్యాలు వంటి ఖరీఫ్ పంటలను సకాలంలో సాగు చేయాలని సూచించారు. ఈ పథకం రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసి, రైతుల ఆదాయాలను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆశిస్తున్నారు.













Click it and Unblock the Notifications