వివాదాలకు చిరునామా ఎమ్మెల్యే రాజాసింగ్..!! 18 సంవత్సరాల్లో 101 కేసులు!!
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పేరు తెలంగాణ రాజకీయాల్లో సుపరిచితం. కార్పొరేటర్గా ప్రారంభమైన ఆయన ప్రస్థానం భారతీయ జనతాపార్టీ శాసనసభా పక్ష నేతగా ఎదిగేవరకు కొనసాగింది. ఈ ఎదుగుదలలో ఆయన వివాదాలనే ఆలంబనగా చేసుకున్నారు. 18 సంవత్సరాల కాలంలో ఎమ్మెల్యేపై 101 కేసులతోపాటు 18 మత విద్వేషపరమైన కేసులున్నాయంటే ఆయన ఎంతటి వివాదాస్పద వ్యక్తో అర్థం చేసుకోవచ్చు.

తెలుగుదేశం పార్టీ నుంచి ప్రారంభమైన ప్రస్థానం
గోషామహల్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున 2018 ఎన్నికల్లో పోటీ చేసే సమయానికి ఆయనపై 43 క్రిమినల్ కేసులున్నాయి. ఇటీవలే చాలావరకు కేసులు వీగిపోయాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు 2009లో జరిగిన ఎన్నికల్లో మంగళహాట్ డివిజన్ నుంచి తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్గా గెలుపొందారు. టీడీపీ నుంచి ప్రారంభమైన ఆయన రాజకీయ ప్రస్థానం బీజేపీకి చేరింది. 2014 ఎన్నికల్లో గోషామహల్ నుంచి బీజేపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే ముఖేశ్గౌడ్పై 50వేల ఓట్లకు పైగా మెజార్టీతో ఘనవిజయం సాధించారు. 2018 ఎన్నికల్లో కూడా విజయకేతనం ఎగరవేశారు. ఆ ఎన్నికల్లో తెలంగాణ మొత్తంమీద గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా రాజాసింగ్ రికార్డు సృష్టించారు.

గోవుల అక్రమ రవాణాను అడ్డుకోవడంతో పేరు
టీడీపీ కార్పొరేటర్గా ఉన్న సమయంలోనే మతపరమైన కార్యకలాపాల్లో పాల్గొంటూ యువతను తనవైపుకు మలుచుకోవడంలో ఆయన విజయవంతమయ్యారు. 2010 నుంచి ప్రతి సంవత్సరం ఆయన శ్రీరామ్ శోభాయాత్రలు నిర్వహిస్తున్నారు. క్రమేణా ఈ యాత్ర నగరంలోని ఇతర ప్రాంతాలకూ విస్తరించడంతో ఆయనపేరు మార్మోగిపోయింది. ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత అప్పర్ ధూల్పేటలోని గంగాబౌలీలో 150 అడుగుల ఎత్తయిన కొండపై 51 అడుగుల ఎత్తయిన ఆంజనేయస్వామి విగ్రహాన్ని రాజాసింగ్ ఏర్పాటు చేవారు. దానికి ఆకాశపురి హనుమాన్ దేవాలయం అని పేరు పెట్టారు. అక్కడే గోశాలను ఏర్పాటు చేయడంతోపాటు ఎక్కడతై గోవులను తరలిస్తున్నారనే సమాచారం అందుతుందో వెంటనే అక్కడకు చేరుకొని ఆ తరలింపును అడ్డుకునేవారు. ఆ సందర్భాల్లోను ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోను గోవుల అక్రమ రవాణాను అడ్డుకున్న ఎమ్మెల్యేగా బాగా పేరు తెచ్చుకున్నారు.

కొనసాగుతున్న రౌడీషీట్
రాజాసింగ్ కుటుంబం తొలుత కార్వాన్ అమ్లాపూర్లో నివసించేది. అక్కడ ఆయన ప్రాణాలకు ముప్పుందంటూ నిఘావర్గాలు హెచ్చరించడంతో తన నివాసాన్ని మంగళ్హాట్కు మార్చారు. తొలుత అప్పర్ధూల్పేటలోని దిలావర్గంజ్లో అద్దెకు దిగారు. కొన్నాళ్ల క్రితం ధూల్పేటలోని జాలీ హనుమాన్ దేవాలయం సమీపంలోని ఆరాంఘర్ కాలనీలో సొంతంగా ఇల్లు కట్టుకున్నారు. రాజాసింగ్పై టపాచబుత్ర పోలీసులు రౌడీషీటు ఓపెన్ చేశారు. ఆయన నివాసం మంగళహాట్కు మారడంతో 2010లో రౌడీషీట్ ను ఇక్కడి స్టేషన్కు బదిలీ చేశారు. అది ఇప్పటికీ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications