కరోనా క్లిష్ట సమయంలో ప్రభుత్వానికి ఇంత అయోమయం ఎందుకు.?సూటిగా ప్రశ్నించిన విజయశాంతి.!
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వంపై మరోసారి అసహనం వ్యక్తం చేసారు బీజేపి నాయకురాలు విజయశాంతి. కరోనా విజృంభిస్తున్న తరుణంలో అప్రమత్తంగా ఉంటూ పారదర్శకంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం అయోమయంగా ఉందని మండిపడ్డారు. అంతే కాకుండా తెలంగాణలో కరోనా వైరస్ కట్టడి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అస్పష్ట వైఖరితో ఉన్నట్టు స్పష్టమవుతోందనన్నారు విజయశాంతి.
కేవలం నైట్ కర్ఫ్యూ వల్ల ఫలితం లేదని తేలిపోయిందని, పగటి పూట నియంత్రణలేమీ లేవా అని ఆమె తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీసారు. మరోవైపు కొన్ని పెద్ద రాష్ట్రాలు పరిస్థితిని అదుపు చేసేందుకు స్పల్ప కాల లాక్డౌన్ విధించాయని, మరి తెలంగాణ విషయానికి వచ్చే సరికి లాక్ డౌన్ వల్ల ఉపాధి, వ్యాపారాలు దెబ్బతిని ఆర్ధిక వ్యవస్థ కుదేలవుతుందని, ధాన్యం సేకరణ కూడా తీవ్రంగా గాడి తప్పుతుందని సీఎం చంద్రశేఖర్ రావు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని రాములమ్మ ఎద్దేవా చేసారు.
అయితే, గతంలో సరి, బేసి సంఖ్యలో దుకాణాలు తెరవడానికి అవకాశమివ్వడం, కోవిడ్ నియంత్రణకు పరిమితుల మధ్య వాణిజ్య, పారిశ్రామిక, ఉద్యోగ, కార్మిక కార్యకలాపాలు నడిచేలా పాస్లు జారీ చేయడం, వంటి చర్యలతో పరిస్థితిని కొంత అదుపు చేసిన సంగతి గుర్తు లేదా? అని విజయశాంతి ప్రశ్నించారు.
ఇక రాష్ట్రంలో కరోనా చికిత్స తీరు, టెస్టుల నిర్వహణ, బెడ్లు, మందులు, వాక్సీన్ అందుబాటుపై దాదాపు రోజూ అధికారులకు కోర్టు మందలింపులు, మీడియా కథనాలు వాస్తవాల్ని చూపిస్తుంటే, సీఎస్ గారు, సీఎం గారు మాత్రం అంతా బాగుందన్నట్టు ప్రకటనలు చేస్తున్నారని విజయశాంతిపేర్కొన్నారు. ఒక రోజు అన్నీ సవ్యంగా ఉన్నాయని చెబుతారని, మరొక రోజు కేంద్రంపై నిందలేస్తూ విమర్శలు చేస్తారని అన్నారు. పరిస్థితిని కట్టడి చెయ్యలేని ఈ తెలంగాణ పాలకుల తీరుపై ఏం చెయ్యాలో తెలియక జనం తల పట్టుకుని కూర్చున్నారని రాములమ్మ ఆవేదన వ్యక్తం చేసారు.