ఉగ్రవాదుల అడ్డాగా హైదరాబాద్: కిషన్, స్వాతంత్య వేడుకల్లో మంత్రి జూపల్లికి నిరసన (ఫోటోలు)
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 69వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని శనివారం ఘనంగా జరుపుకున్నారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ భవన్లో హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి, ఆదిలాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో మంత్రి జోగు రామన్న, నిజామాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, కరీంనగర్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఈటెల రాజేందర్, సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో చాడ వెంకట రెడ్డిలు జాతీయ జెండాలను ఆవిష్కరించారు.
గాంధీభవన్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన ఉత్తమ్కుమార్రెడ్డి
గాంధీభవన్లో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కార్యకర్తలందరూ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. పార్టీని నమ్ముకున్న కార్యకర్తలను కాంగ్రెస్ ఎప్పటికీ విస్మరించదని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు హాజరయ్యారు.
ఎన్టీఆర్ భవన్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్లో 69వ స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ తెదేపా అధ్యక్షుడు ఎల్.రమణ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ తెలంగాణ శాసనసభాపక్షనేత ఎర్రబెల్లి దయాకర్రావు, నగర అధ్యక్షుడు తలసాని కృష్ణయాదవ్, ఎమ్మెల్సీ టి.డి. జనార్థన్, పలువురు తెదేపా నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

బీజేపీ కార్యాలయంలో స్వాతంత్య్ర వేడుకలు
నగరంలోని బీజేపీ కార్యాలయంలో స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరిగాయి. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు.

బీజేపీ కార్యాలయంలో స్వాతంత్య్ర వేడుకలు
ఈ సందర్భంగా ఆయన తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సర్కారు ఉదాసీన వైఖరి కారణంగా హైదరాబాదు ఉగ్రవాదులకు అడ్డాగా మారుతోందని ఆరోపించారు.

బీజేపీ కార్యాలయంలో స్వాతంత్య్ర వేడుకలు
అనుమానాస్పద ప్రాంతాల్లోని ఇంటింటినీ చెక్ చేయకపోతే సమీప భవిష్యత్తులోనే పెను ముప్పు సంభవించే ప్రమాదం లేకపోలేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎంఐఎంతో టీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం కారణంగానే సెప్టెంబర్
17న విమోచన దినోత్సవానికి ప్రభుత్వం మోకాలొడ్డుతోందని ఆయన ఆరోపించారు.

బీజేపీ కార్యాలయంలో స్వాతంత్య్ర వేడుకలు
ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్సీ రామచంద్రరావు, భాజపా నేతలు ఇంద్రసేనారెడ్డి, బద్దం బాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు
తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ శాసనసభ సభాపతి మధుసూదనాచారి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అసెంబ్లీ ప్రాంగణంలోని మహాత్మాగాంధీ, అంబేద్కర్ విగ్రహాల వద్ద నివాళులర్పించారు. కార్యక్రమంలో శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్, అసెంబ్లీ కార్యదర్శి సదారాం తదితరులు పాల్గొన్నారు.
ఇందిరాభవన్లో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు
హైదరాబాద్లోని ఇందిరాభవన్ లో 69వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఏపీసీసీ ఉపాధ్యక్షుడు మాదాసు గంగాధరం ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుందని ఆయన అన్నారు.
కరీంనగర్లో జాతీయ జెండాకు అవమానం
కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లి మండలం రంగంపల్లిలోని ఎంవీఐ కార్యాలయంలో జాతీయ జెండాకు అవమానం జరిగింది. వేడుకల్లో భాగంగా జాతీయ జెండాను ఆవిష్కరించగా అది తిరగబడింది. వెంటనే ఇది గమనించిన అధికారులు తిరిగి సజావుగా ఎగురవేశారు.
మంత్రి జూపల్లికి నిరసన
మహబూబ్నగర్ జిల్లాలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో టీఆర్ఎస్లో నేతల మధ్య బేధాభిప్రాయలు చోటు చేసుకున్నాయి. వేడుకల్లో భాగంగా సమరయోధులు, ఉద్యమకారులకు సన్మానం సందర్భంగా ఆహ్వానం పంపలేదని మంత్రి జూపల్లి, కలెక్టర్పై నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
జెండావందనం తర్వాత కార్యక్రమాలను ఎమ్మెల్యేలు శ్రీనివాస్గౌడ్, ఆళ్లవెంకటేశ్వర్, జెడ్పీచైర్మన్ బండారిభాస్కర్ బహిష్కరించారు. తమను అవమానించారంటూ మంత్రి, కలెక్టర్ ఎదుట నేతలు నిరసనకు దిగారు.












Click it and Unblock the Notifications