గవర్నర్ 'నరసింహ', కెటిఆర్కి రైతు షాక్, ఇప్పుడు పిల్లల్ని కనలేనని ఓ మహిళ (పిక్చర్స్)
మహబూబ్ నగర్: విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ సిబ్బంది పైన రాష్ట్ర గవర్నర్ నరసింహన్ సోమవారం నాడు నరసింహావతారం ఎత్తారు. ప్రభుత్వ పథకాల అమలు తీరును తెలుసుకొన్న ఆయన తన దృష్టికి వచ్చిన అవకతవకల పైన ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధికారులను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. మహబూబ్ నగర్ జిల్లా ఆదర్శ గ్రామాలైన కిషన్ నగర్, హాజిపల్లిల్లో సోమవారం నిర్వహించిన గ్రామజ్యోతిలో మంత్రులు కెటిఆర్, జూపల్లి కృష్ణా రావు, లక్ష్మారెడ్డిలతో కలిసి గవర్నర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గవర్నర్ విద్యార్థుల చదువుల తీరును పరిశీలించారు. చిన్నారులతో పద్యాలు పాడించారు. మధ్యాహ్న భోజనంలో గుడ్లు పెడుతున్నారా అని ఆరా తీశారు. సరిగా ఇవ్వడం లేదని, వారంలో ఒకరోజు ఇస్తున్నారని చెప్పడంతో.. ప్రధానోపాధ్యాయుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడ్లు నీవు తింటున్నావా, తీసుకెళ్తున్నావా అని గవర్నర్ ఎంఇవో శంకర్ రాథోడ్తో అనడంతో నవ్వులు విరిశాయి.
గుడ్లు సరిగా ఇవ్వకుంటే వాటి బిల్లులు ఎవరు తింటున్నారని నిలదీశారు. కిషన్ నగర్ సర్పంచిని వచ్చే ఏడాది కాలంలో ఏం చేయబోతున్నారని అడిగారు. మిషన్ కాకతీయ పనులపై గవర్నర్ ఆరా తీశారు. బడి ఈడు పిల్లలు అందరూ బడికి వెళ్లాలని సూచించారు.
పాలమూరులో గవర్నర్, మంత్రులు
పిల్లలను బాగా చదివిస్తామని తల్లిదండ్రులు ప్రమాణం చేయాలని సూచించారు. ఉదయం తొమ్మిదిన్నరకు జిల్లాకు వచ్చిన గవర్నర్ సాయంత్రం నాలుగు గంటల వరకు ఉన్నారు. బ్యాంకుల నుంచి తీసుకొన్న రుణాలను వడ్డీకి ఇస్తున్నారు కదా.. అని మంత్రి కెటిఆర్ అనడంతో సభలో నవ్వులు విరిశాయి.
పాలమూరులో గవర్నర్, మంత్రులు
గ్రామంలో బియ్యం తక్కువగా ఇస్తున్నారని ఓ మహిళ ఫిర్యాదు చేసింది. దీంతో డీలర్ను పిలిపించి ప్రశ్నించారు. మంత్రి కెటిఆర్ పలు సందర్భాల్లో నవ్వులు పూయించారు. ఓ మహిళ మాట్లాడుతూ.. దొడ్డు బియ్యం తినలేకపోతున్నామని చెప్పింది. దానికి మీకు ఎంతమంది పిల్లలు అని కెటిఆర్ అడిగారు. ఇద్దరు పిల్లలు అని ఆమె సమాధానం ఇచ్చింది. వారిని బడికి పంపిస్తే సన్నబియ్యం తింటారు కదా అని మంత్రి అన్నారు. దానికి ఆమె.. సార్ బడికి పంపాలంటే ఇప్పుడు పిల్లల్ని కనలేం కదా, మా పిల్లలకు పెళ్లిళ్లు అయ్యాయి అని చెప్పడంతో మరోసారి నవ్వులు విరిశాయి. గవర్నర్, మంత్రులు అందరూ నవ్వారు.
పాలమూరులో గవర్నర్, మంత్రులు
గవర్నర్ నరసింహన్ సోమవారం షాద్నగర్ మండలం కిషన్నగర్, హాజిపల్లి గ్రామాలలో పర్యటించారు. ఈ సంధర్భంగా నిర్వహించిన గ్రామజ్యోతి సభలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కిషన్ నగర్ గ్రామ పంచాయతీ అవరణలో గల నీటి శుద్ది కేంద్రాన్ని, నూతనంగా నిర్మించిన మరుగుదొడ్లను, అంగన్వాడి కేంద్రాన్ని, వయోజన విద్యా కేంద్రాన్ని పరిశీలించారు.
పాలమూరులో గవర్నర్, మంత్రులు
అనంతరం రోడ్డుకు ఇరువైపుల మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని మంత్రులు కెటిఆర్, జూపల్లి కృష్ణారెడ్డి, కలెక్టర్ టికె శ్రీదేవితో కలిసి మొక్కలు నాటారు. అక్కడి నుండి పాఠశాలకు వెళ్లారు. గ్రామంలో గవర్నర్ నరసింహన్ పర్యటిస్తున్న నేపధ్యంలో గ్రామస్తులు, విద్యార్థులు పూలవర్షం కురిపించారు. పాఠశాలను తనిఖీ చేసి మధ్యాహ్న భోజనం వంటలను కూడా పరిశీలించారు.
పాలమూరులో గవర్నర్, మంత్రులు
నీటి శుద్ది, నీటి సరఫరా తదితర అంశాల కమిటి సభ్యులు ముఖాముఖి మాట్లాడారు. కమిటి చైర్మన్ నర్సింలు గ్రామంలో త్రాగునీరు ఎలా అందిస్తున్నారని గవర్నర్ ప్రశ్నించారు. ఇందుకు నర్సింలు సమాధానం చెబుతూ 20 లీటర్ల డబ్బాకు ఐదు రూపాయల చొప్పున శుద్ది చేసిన నీటిని అందిస్తున్నామని, ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఉందని వివరించారు. రోజుకు మూడు గంటల చొప్పున నీరు అందిస్తున్నట్లు తెలిపారు.
పాలమూరులో గవర్నర్, మంత్రులు
ఇంతలోపే గ్రామస్తులు మూడు గంటలు నీరు వస్తలేదని తెలిపారు. ఇదేమిటి అబద్దం చెప్పడం మహిళలు నీళ్లు వస్తలేవంటే, నీవేమో నీళ్లు వస్తున్నాయని చెబుతున్నావన్నారు. దీంతో ఒక్కసారిగా సభలో నవ్వుల వర్షం కురిసింది. అదే విధంగా పారిశుద్ద్యం, చెత్తడంపింగ్ యార్డులపై ఆరా తీసి ఈ సభ్యులతో ముఖాముఖిగా గవర్నర్తో మాట్లాడారు.
పాలమూరులో గవర్నర్, మంత్రులు
గవర్నర్ రైతు రుణ మాఫీ ఏవిధంగా ఉందని ప్రశ్నించారు. మల్లారెడ్డి సమాధానం చెబుతూ రుణమాఫీ ప్రభుత్వం ఇచ్చింది కానీ ఒకేసారి ఇచ్చింటే బాగుండేదన్నారు. మొదటి విడత 25శాతం వచ్చిందని, వడ్డీకే సరిపోయిందని, రెండో విడత ఇంకా రాలేదన్నారు. మంత్రి కెటిఆర్ కల్పించుకుని రెండో విడత కూడా 25శాతం ఇవ్వడం జరిగిందన్నారు. కాదుకాదు 12శాతమే వచ్చిందని రైతు మల్లారెడ్డి సమాధానం చెప్పారు. అక్కడే బ్యాంక్ మేనేజర్ను మంత్రి ఆరా తీయగా కొంత గందరగోళం ఏర్పడింది. మహబూబ్నగర్ జిల్లాలో రైతు రుణమాఫీపై అవగాహన లేదని, మంత్రులకు, అధికారులకు అవగాహన లేకుంటే ఎలా అని కెటిఆర్ అన్నారు.