ప్రధాని మోడీతో గవర్నర్ భేటీ: చర్చకు వచ్చిన అంశాలివే
అమరావతి: తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా గడుపుతున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం రాత్రి ఢిల్లీకి బయల్దేరి వెళ్లిన ఆయన మంగళవారం ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అయ్యారు. ఏపీకి కేంద్రం ప్రత్యేక సాయం ప్రకటించిన అనంతరం రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులపై ప్రధానితో చర్చిస్తున్నారు.
దీంతోపాటు ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాద అంశాలను ఆయన మోడీకి వివరిస్తున్నారు. ఢిల్లీలోని ఏపీ భవన్ పంపిణీ, ఉద్యోగుల విభజన, పలు శాఖలు, హైదరాబాద్లోని వివిధ భవనాల విభజన అంశాలను గురించి కూడా ఆయన మోడీకి వివరిస్తున్నట్లు తెలుస్తోంది.
ఆ తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్తో సమావేశం కానున్నారు. ఈ సమావేశాల్లో హైకోర్టు విభజన, తొమ్మిది, పదో షెడ్యూళ్లలోని సంస్థల విభజన, జల వివాదాలు సహా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వివిధ అపరిష్కృత సమస్యలపై ఆయన చర్చించనున్నారు. ఇప్పటికే సమావేశానికి సిద్ధం కావాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచనలు ఇచ్చిన ఆయన, కేంద్రంతో చర్చించిన అనంతరం వారిద్దరితో సమావేశం నిర్వహించనున్నారు.
తొలుత కేంద్ర మంత్రి సుజనా చౌదరిని గవర్నర్ కలిశారు. మరోవైపు గత మూడు రోజులుగా ఢిల్లీలోనే ఉంటున్న తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ గవర్నర్ నరసింహాన్ను కలిశారు. ఏపీ భవన్ను 58:42 నిష్పత్తిలో విభజించాలన్న వాదనను సీఎస్ వ్యతిరేకిస్తున్నారు. ఇక ఈరోజు సాయంత్రం 6 గంటలకు రాష్ట్రపతితో గవర్నర్ భేటీ అయ్యే అవకాశం ఉంది.
అయితే ఈ భేటీ మాత్రమ మర్యాదపూర్వకమైన భేటీయేనని తెలుస్తోంది. కాగా, మంగళవారం బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలోని ముస్లింలకు గవర్నర్ నరసింహన్ సోమవారం శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, త్యాగం, దైవభక్తి, కరుణలకు బక్రీద్ నిదర్శనమని చెప్పిన ఆయన పండుగను ఘనంగా నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు.