గౌరవం లేదు - అవమానిస్తున్నారు: గవర్నర్ తమిళసై..!!
తెలంగాణ గవర్నర్ తమిళసై మరోసారి టీఆర్ఎస్ ప్రభుత్వం పైన విమర్శలు చేసారు. గవర్నర్ విషయంలో రాష్ట్రంలో అప్రజాస్వామిక పరిస్థితి నెలకొందని గవర్నర్ తమిళ సై అన్నారు. గవర్నర్ పై జరుగుతున్న అవమానాలకు రాష్ట్ర ప్రభుత్వం జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. ఓ జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ తమిళిసై మరోసారి తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ను అవమానిస్తున్న తీరును ఎండగట్టారు. గవర్నర్ పదవి అంటే తెలంగాణ ప్రభుత్వానికి ఏమాత్రం గౌరవం లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు.
రాజ్భవన్లో గణతంత్ర దినోత్సవ వేడుకలకు సీఎం కేసీఆర్ను ఆహ్వానించామని, అసలు ఆయన హాజరవుతారా లేదా అనే సమాచారం కూడా ఇవ్వలేదని గవర్నర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తాను హాజరయ్యే కార్యక్రమాలకు సీఎం కేసీఆర్ తో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కావడం లేదని చెప్పుకొచ్చారు. రాజ్యాంగబద్దమైన పదవిలో ఒక మహిళ ఉండటం సీఎంకు ఇష్టం ఉండదేమోనని, అందుకే ఈ రకంగా అవమానిస్తున్నారని సందేహాన్ని వ్యక్తంచేశారు. అసెంబ్లీలో ప్రసంగించే అవకాశాన్ని కూడా కల్పించడం లేదని, ప్రజల మధ్య గణతంత్ర వేడుకల్లో జాతీయ జెండా ఆవిష్కరించే అవకాశం లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ చర్యలన్నీ గవర్నర్ పదవిని అవమానపరచడమేనని పేర్కొన్నారు. గత నెలలో తన ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని సందేహం వ్యక్తం చేసిన గవర్నర్..తనపై కూడా నిఘా ఉందని భావిస్తున్నానని చెప్పుకొచ్చారు.
కనీస ప్రోటోకాల్ను పాటించరని గవర్నర్ ఆవేదన వ్యక్తం చేసారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన అగ్నిపథ్ ఆందోళన సమయంలో రాజ్భవన్ ముందు ఆందోళన చేయాలని ట్వీట్ చేయడం ఏమిటని గవర్నర్ ప్రశ్నించారు. ప్రస్తుతం రాష్ట్రంలో అప్రజాస్వామిక విధానం అమల్లో ఉందని వివరించారు. అసెంబ్లీలో తన ప్రసంగం లేకుండా వివక్ష చూపుతున్నారని ఇందు కోసం ఏకంగా అసెంబ్లీలో గవర్నర్ స్పీచ్ అవసరం లేదంటూ తీర్మానం చేశారు. ఇదేం వివక్ష అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో భిన్నత్వంలో ఏకత్వానికి, సమగ్రతకు రాజ్యాంగమే మూలమని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ఏడు దశాబ్దాలకుపైగా అనేక సవాళ్లు ఎదుర్కొన్నప్పటికీ, దేశంలో దృఢమైన ప్రజాస్వామ్య పునాదుల్ని నిర్మించడంలో భారత రాజ్యాంగం అత్యున్నతమైనదిగా నిలిచిందని గవర్నర్ చెప్పారు.