తెలంగాణకు కొత్త గవర్నర్..!!? వీరిలో ఒకరికి ఛాన్స్ - ఢిల్లీ కేంద్రంగా తాజా వ్యూహాలు..!!
తెలంగాణ కు కొత్త గవర్నర్ రాబోతున్నారా. కొత్త గవర్నర్ గా ఎవరికి అవకాశం దక్కనుంది. ఢిల్లీ పర్యటనల్లో అవమానం జరిగిందని ఆవేదన చెందిన తమిళసై స్థానంలో మరొకరికి అవకాశం ఇవ్వాలనే దిశగా కేంద్రం అడుగులు వేస్తుందంటూ ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం సాగుతోంది. కొద్ది రోజులుగా తెలంగాణ ప్రభుత్వం - రాజ్ భవన్ మధ్య గ్యాప్ కొనసాగుతోంది. కొద్ది రోజుల క్రితం ఢిల్లీ వచ్చిన గవర్నర్ ప్రధాని మోదీతో పాటుగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో సమావేశమయ్యారు. ఆ సమయంలో తెలంగాణలో చోటు చేసుకుంటున్న పరిణామాలు..తనను అవమానించే విధంగా వ్యవహరించారంటూ చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో చర్చకు కారణమయ్యాయి.

ఢిల్లీ పర్యటన..కేంద్రంతో చర్చలు
ఇదే సమయంలో కొందరు మంత్రులు సైతం గవర్నర్ వ్యాఖ్యలను తప్పు బట్టారు. ఎక్కడ అవమానం జరిగిందో స్పష్టం చేయాలని డిమాండ్ చేసారు. గవర్నర్ వ్యవస్థ అవసరం లేదనే స్థాయిలో వ్యాఖ్యలు వినిపించాయి. తన పర్యటనల సమయంలో ప్రోటోకాల్ పాటించటం లేదని గవర్నర్ ఆవేదన వ్యక్తం చేసారు. ఇది తనకు వ్యక్తిగతంగా జరుగుతున్న అవమానం కాదని..రాజ్ భవన్ కు జరగుతున్న అవమానంగా అభిప్రాయపడ్డారు. తాజాగా..ఢిల్లీ పర్యటనలో గవర్నర్ తనకు తెలంగాణ బాధ్యతల నుంచి తప్పించాలని కోరినట్లుగా ఢిల్లీ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం సాగుతోంది. కానీ, కేంద్ర ప్రభుత్వ పెద్దలు ప్రస్తుతం తెలంగాణలో చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో గవర్నర్ మార్పుకు సుముఖంగా లేరనే వాదన బలంగా వినిపిస్తోంది.

గవర్నర్ ను మారిస్తే..కొత్తగా ఛాన్స్ దక్కేదెవరికి
అయితే, బదిలీ చేయాల్సి వస్తే..ప్రత్యామ్నాయంగా ఎవరికి అవకాశం ఇస్తారనే దాని పైనా అధికార వర్గాల్లో ముందస్తుగానే కసరత్తు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. తమిళిసైని పుదుచ్చేరి గవర్నర్గా కొనసాగించినా అక్కడ విపక్షాలు కూడా ఆమెపై విమర్శలు చేసే అవకాశం ఉందని తాజాగా తమిళ సంవత్సరాది సందర్భంగా గవర్నర్ నిర్వహించిన విందు కార్యక్రమాన్ని విపక్షాలు బహిష్కరించి నిరసన వ్యక్తం చేసిన అంశాన్ని కేంద్ర ప్రభుత్వ పెద్దలు పరిగణలోకి తీసుకున్నట్లుగా చెబుతున్నారు. తెలంగాణలో జరుగుతున్న పరిణామాలపై గవర్నర్ తమిళిసై తాజాగా అందజేసిన నివేదికలను కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తున్నట్టు సమాచారం. తెలంగాణ ప్రస్తుత గవర్నర్ ను మారిస్తే..ఆ స్థానంలో పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగ్దీప్ ధన్కర్, కర్నాటక గవర్నర్ తవర్ చంద్ గెహ్లాట్, మహారాష్ట్ర గవర్న్ భగత్సింగ్ కోషియారి, తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిలలో ఒకరిని తెలంగాణకు బదిలీ చేసే అవకాశముందని ప్రచారం జరుగుతోంది.

గవర్నర్ ను మారిస్తే... కేంద్రం అంగీకరించేనా
పాత వీడియో క్లిప్పంగులతో తన పైన దుష్ఫ్రచారం చేస్తున్నారనే అంశాన్ని గవర్నర్ కేంద్రం కు అందచేసినట్లు సమాచారం. దీంతో..పాటుగా రాజకీయంగానూ తెలంగాణ అధికార పార్టీ వర్సెస్ కేంద్రం అన్నట్లుగా మారిన పరిస్థితుల్లో ఇప్పుడు ఢిల్లీ కేంద్రంగా తెలంగాణ లో అమలు చేయాల్సిన యాక్షన్ ప్లాన్ గురించి కసరత్తు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. అందులో బీజేపీ నుంచి కౌంటర్ గా రాజకీయ వ్యూహాలు అమలు చేసే దిశగా త్వరలోనే కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక, గవర్నర్ మార్పుకు సంబంధించి కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతుంది.












Click it and Unblock the Notifications