సాయిబాబా గుళ్లలో హిందూ దేవుళ్లెందుకు?: గోవిందానంద స్వామి
హైదరాబాద్: షిర్డీ సాయిబాబా మందిరాలలో హిందువుల దేవుళ్ల విగ్రహాలు పెట్టడం సరికాదని, సాయి దేవాలయాల్లో తమ దేవుళ్ల విగ్రహాలు పెట్టకుండా పూజలు చేసుకుంటే తమకు అభ్యంతరం లేదని శ్రీ గోవిందానంద స్వామి గురువారం అన్నారు.
సనాతన ధర్మాలకు, శంకరాచార్యుల సంప్రదాయాలకు విరుద్ధంగా, మతమే లేని సాయిబాబా దేవాలయాల్లో హిందువుల దేవతల విగ్రహాలు అవసరం లేదన్నారు. ఎవరు పడితే వారు పీఠాలు పెడుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని ధ్వజమెత్తారు.
దేనికైనా శాస్త్రమే ప్రమాణమని చెప్పారు. సాయికి చేస్తున్న పూజలు ఏ శాస్త్రంలో ఉన్నాయో చెప్పాలన్నారు. పూజలు ఇలా చేయాలని ఎక్కడ రాసి ఉందని ప్రశ్నించారు. హిందూమత శాస్త్రాల్లోని అంశాలనే తీసుకొని వాటిని కలుషితం చేస్తున్నారన్నారు.
రామాయణం, మహాభారతం హిందువుల పరమపవిత్రమైన పురాణాలు అని చెప్పారు. వాటిపై రమణానంద అనుచిత వ్యాఖ్యలు సరికాదన్నారు. రామాయణ, మహాభారతాలను తప్పుపట్టేవారు సాయిదేశం పేరిట ఓ దేశం పెట్టుకొని వెళ్లిపోవాలన్నారు.
కాగా, మంచి, మానవత్వం, ఆధ్యాత్మికం అంశాలను బోధించాల్సిన ఇద్దరు స్వాములు శివాలెత్తిన విషయం తెలిసిందే. భక్తుల మధ్యే వాగ్వాదానికి దిగారు. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో బుధవారం రాత్రి ఈ సంఘటన జరిగింది. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత కనిపించింది. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిను అదుపులోకి తెచ్చారు.