ఓ టీచర్.. 8 కంపెనీలు: 'కలిస్తే గెలుస్తాం' నినాదంతో ఏపీ-తెలంగాణల్లో రూ.150 కోట్ల భారీ మోసం
హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాలలో రూ.150 కోట్ల మేర మోసం చేసిన ఓ నిందితుడిని సైబరాబాద్ ఎకనామిక్ అఫెండర్స్ వింగ్ శుక్రవారం అరెస్ట్ చేసింది. ఆ నిందితుడు ఓ ప్రభుత్వ టీచర్. ఉద్యోగానికి లాంగ్ లీవ్ పెట్టి ఏడు కంపెనీలు ఏర్పాటు చేసి, అందుకు పెట్టుబడుల కోసం వేలాది మందిని పణంగా పెట్టాడు. నూటికి రూ.6 శాతం వడ్డీ చూపి దాదాపు పద్నాలుగు వేల మందిని మోసం చేశాడు. చివరకు దొరికిపోయాడు.
అంతమందిని చీట్ చేసిన సదరు టీచర్ పేరు రవీందర్. అతను సన్ పరివార్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ను ప్రారంభించాడు. ఈ కంపెనీకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. పోలీసులు అతని బ్యాంక్ అకౌంట్లలో ఉన్న రూ.14 కోట్లను ఫ్రీజ్ చేశారు. ఈ మేరకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ శుక్రవారం వివరాలు వెల్లడించారు.
గవర్నమెంట్ టీచర్
రవిందర్ సిద్దిపేట జిల్లాలోని రేవల్లి గ్రామం అప్పర్ ప్రైమరీ పాఠశాలలో గవర్నమెంట్ టీచర్. ఈ ఉద్యగం ద్వారా వచ్చే జీతంతో అతను ఏమాత్రం సంతృప్తి చెందలేదు. దీంతో అతను ఉద్యోగానికి లాంగ్ లీవ్ పెట్టాడు. 2015లో సంగారెడ్డిలో సన్ పరివార్ గ్రూప్ను అనే కంపెనీని ప్రారంభించాడు. ఆ తర్వాత అతను ఏకంగా ఎనిమిది కంపెనీలను ప్రారంభించాడు.
పలు కంపెనీలు ప్రారంభం
సన్ మ్యుచువల్లీ ఎయిడెడ్ థ్రిఫ్ట్ అండ్ క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్, మెతుకు చిట్ ఫండ్స్, మెతుకు వెంచర్స్ వంటి ఎనిమిది కంపెనీలను ప్రారంభించాడు. ఈ కంపెనీలన్నింటిని కూడా సన్ పరివార్ గ్రూప్ కింద ప్రారంభించాడు. ఈ కంపెనీలను కూడా తన ప్రాణ స్నేహితులు, ఇతర బంధువులు, కుటుంబ సభ్యుల పేరుతో ప్రారంభించాడు.
కలిస్తే గెలుస్తామంటూ రూ.150 కోట్లు ముంచిన ప్రభుత్వ టీచర్
రవిందర్ కస్టమర్స్ను ఆకట్టుకోవడానికి ఓ నినాదం కూడా పెట్టుకున్నాడు. 'కలిస్తే గెలుస్తాం' అనే నినాదంతో రూ.150 కోట్ల పెట్టుబడులు రాబట్టాడు. భారీ వడ్డీ ఆశ పెట్టి పలు సమావేశాలు నిర్వహించి నిధులు రాబట్టాడు. ఆయా సమావేశాల్లో ఈ స్కీం గురించి వివరించాడు. అతని మాటలు నమ్మి లక్షలాది రూపాయలు అతని చేతికి ఇచ్చారు.
స్కీం ఇది అని వివరించాడు
కస్టమర్లు ఇచ్చిన డబ్బులకు హామీ పత్రాలు ఇవ్వడంతో పాటు రూ.లక్షకు నెలకు రూ.6వేల వడ్డీని 25 నెలల పాటు ఇస్తానని, ఆ తర్వాత 26వ నెల రూ.లక్ష కూడా తిరిగి ఇస్తానని చాలామందిని నమ్మించాడు. ఈ స్కీంను నమ్మిన 14 వేల మంది రూ.150 కోట్లు ఇచ్చారు. అయితే ముందు డబ్బులు ఇచ్చిన వారికి వడ్డీ సరిగా చెల్లించకపోవడంతో ఓ వ్యక్తి శామిర్ పేట్ పోలీసులకు పిర్యాదు చేశాడు. ఈ కేసుతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చెపట్టడంతో అసలు విషయం వెలుగు చూసింది.
ఏజెంట్లకు హాలీ డే ట్రిప్ ఆశలు
అంతేకాదు, ఏజెంట్లను కూడా నియమించుకున్నాడు. ఆకర్షణీయ ఇన్సెంటివ్స్ ఆశ చూపి వారి ద్వారా డబ్బులు సేకరించాడు. ఎవరైనా రూ.5 లక్షలు డిపాజిట్ చేయిస్తే వారికి తొమ్మిది నెలల పాటు 3 శాతం కమిషన్, రూ.5 లక్షలకు పైగా డిపాజిట్ చేయిస్తే 4 శాతం కమిషన్ ఇస్తానని ఏజెంట్స్ను ఆకట్టుకున్నాడు. సభ్యుడిగా చేరిన వ్యక్తి మరొకరిని చేర్పిస్తే 3 శాతం కమిషన్ ఇస్తానని చెప్పాడు. అంతేకాదు, టార్గెట్ అందుకున్న ఏజెంట్లను గోవా, షిమ్లా, బ్యాంకాంక్, దుబాయ్ వంటి చోట్లకు హాలీడే ట్రిప్స్కు తీసుకు వెళ్లాడు. రూ.150 కోట్ల మేర వసూలు చేసిన అతను ఆ తర్వాత పేమెంట్స్ ఇవ్వడం ఆపేశాడు. దీంతో శామీర్ పేటకు డిపాజిటర్ దుర్గాదాస్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేశారు. అతను పెద్ద మొత్తంలో శ్రీ చక్ర వెంచర్స్ అనే మరో కంపెనీకి దారి మళ్లించి, ఆస్తులు కూడబెట్టినట్లుగా గుర్తించారని తెలుస్తోంది.