శ్రీకాంతచారి తల్లి శంకరమ్మ విషయంపై స్పందించిన ఉత్తమ్, ఇచ్చిన ఆఫర్ తెలుసా?
హుజూర్ నగర్: తెలంగాణలో కేసీఆర్ ప్రజావ్యతిరేక విధానాలు అవలంభించారని, అన్ని వర్గాలకు అన్యాయం జరిగిందని, ప్రజాకంటక పాలనను అంతే చేస్తామని తెలంగాణ పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన భారీ ర్యాలీతో నామినేషన్ దాఖలు చేసారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
ఒక్క టిక్కెట్ ఇవ్వరా, మీకు మేం వద్దా: కాంగ్రెస్పై 'కమ్మ'ల ఆగ్రహం, ఆ పదవి ఇచ్చినా..
హుజూర్నగర్ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఉత్తమ్ రెండు సెట్ల నామపత్రాలు దాఖలు చేశారు. అంతకుముందు ఉత్తమ్ తన సతీమణి పద్మావతితో కలిసి హుజూర్నగర్ పట్టణ పొలిమేరకు చేరుకున్న సమయంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం సమీపంలో ఉన్న ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లి, నామినేషన్ పత్రాలను స్వామివారి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. భారీ ర్యాలీతో నామినేషన్ దాఖలు చేసారు.
సచివాలయానికే రాని కేసీఆర్కు అధికారం ఆశించే హక్కులేదు
అనంతరం ఉత్తమ్ మాట్లాడారు. సచివాలయానికే రాని కేసీఆర్కు మళ్లీ అధికారం ఆశించే హక్కు లేదని చెప్పారు. రాష్ట్రాన్ని తమ జాగీరుగా భావిస్తూ కేసీఆర్ కుటుంబం వనరులను దోచుకుందన్నారు. నాలుగున్నరేళ్ల పాలనలో కేసీఆర్ మాయమాటలతో ప్రజలను మభ్యపెట్టారన్నారు. మూడెకరాల సాగు భూమి ఇస్తామని దళితులను, రెండు పడకల గదుల ఇళ్లు కట్టిస్తామని పేదల్ని మోసం చేశారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కనీస ఉమ్మడి ప్రణాళికను అమలు చేస్తామన్నారు. అమలు కమిటీ కన్వీనర్గా కోదండరాం, సభ్యులుగా కాంగ్రెస్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఉంటారని చెప్పారు. కమిటీకి చట్టబద్ధత, కన్వీనర్, సభ్యులకు కేబినెట్ హోదా కల్పిస్తామన్నారు. తెరాసను ఓడించేందుకే మహాకూటమి ఏర్పడిందని చెప్పారు.
శంకరమ్మకు ఉత్తమ్ ఆఫర్
మూడు దశాబ్దాలుగా కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల ప్రజలను తమ సొంత పిల్లలుగా భావిస్తున్నామని ఉత్తమ్ అన్నారు. ప్రజలు ఆశీర్వదించి తమను గెలిపించాలన్నారు. మలి విడత ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ నాలుగేళ్లుగా నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ కోసం కష్టపడుతున్నారని చెప్పారు. కనీసం నామినేటెడ్ పదవులు ఇవ్వలేదని మండిపడ్డారు. ఆమెను మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని చెప్పారు. ఆమెకు పార్టీలో సముచిత గౌరవం కల్పిస్తామని చెప్పారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డికి సొంత కారు లేదు
తనకు కారు లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి నామినేషన్ పత్రాల్లో పేర్కొన్నారు. 2014 ఎన్నికల్లో ఉత్తమ్, ఆయన భార్య పద్మావతి పేరిట సొంత వాహనాలు లేవని నామినేషన్ పత్రాల్లో తెలిపారు. తర్వాత 2015 మార్చిలో పద్మావతి పేరిట టయోటా ఫ్యార్చూనర్ను కొన్నారు. గతంలో ఆయనపై కేసులు లేవని పేర్కొన్నారు. ఇప్పుడు నల్గొండ రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో ఐదో నిందితుడిగా ఉన్నారు. ఎలాంటి సమన్లు జారీ కాలేదు.
జూబ్లీహిల్స్ ఉత్తమ్ ఉంటి విలువ తగ్గింది
ఉత్తమ్ భార్య పద్మావతిపేరిట 14.17 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇది మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం కొడగల్లో ఉంది. ఎకరా రూ.లక్షకు కొనుగోలు చేశారు. పద్మావతి పేరుపై 2014లో 450 గ్రాముల బంగారం ఉండగా, ఇప్పుడు అది కూడా లేదు. 2014లో మొత్తం ఆస్తుల విలువ రూ.3,11,65,088 చూపారు. ఇప్పుడు రూ.3,07,14,956 ఉంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని రోడ్డు నెంబరు.45లో ఉన్న ఇంటి విలువను 2014లో రూ.1,89,07,200గా చూపగా, ప్రస్తుతం ఆ ఇంటి విలువను రూ.1,51,54,200గా చూపారు. నాలుగేళ్లలో ఆయన ఇంటి విలువ రూ.37 లక్షలకు పైగా తగ్గినట్లు పేర్కొనడం గమనార్హం.